YSRCP: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ బీసీ పల్లవి అందుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు టిడిపి ఆయువుపట్టుగా ఉన్న బీసీలకు అనుకూలంగా ప్రకటనలు చేసేవారు. చాలా కార్యక్రమాలు కూడా చేపట్టారు. కానీ మొన్నటి ఎన్నికల్లో బీసీలు నమ్మలేదు. మళ్లీ ఇప్పుడు బీసీ నినాదం అందుకున్నారు.. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ప్రకటిస్తే.. తాము రాజకీయ అవకాశాలు కల్పించామంటూ.. పెద్ద ఎత్తున బీసీలకు పదవులు ఇచ్చామంటూ చెబుతున్నారు. దీనిపై కూటమి నుంచి విమర్శలు రావడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక రకమైన ప్రశ్న వినిపిస్తోంది. బీసీలకు ఇచ్చారు సరే.. కానీ అధికారాలన్నీ తమ వద్దే పెట్టుకున్నారు కదా అని గుర్తు చేస్తున్నారు. నాడు ఆ నలుగురు తప్ప పదవులు పొందిన బీసీ నేతలు పవర్ లేక విలవిలలాడారు. ఆ చుట్టూ ఉన్న నలుగురు చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్నట్టుగా ఉండేది. పైగా ఇప్పుడు అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారు కూడా బీసీ నేతలు కాదు. బీసీ మంత్రులు కాదు. ఆ నలుగురే కదా అంటూ సెటైర్లు పడుతున్నాయి.
* అప్పట్లో ఆ నలుగురే..
జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక విజయసాయిరెడ్డి, ఒక వై వి సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి లాంటి వారే పవర్ సెంటర్లు గా ఉండేవారు. మంత్రులుగా ఉన్న నేతలు సైతం జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి ని కలవాలి. ఢిల్లీలో ఏదైనా మాట్లాడాలంటే విజయసాయిరెడ్డి అనుమతి తీసుకోవాలి. రాయలసీమలో పని జరగాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలవాలి. ఉత్తరాంధ్రకు సంబంధించి వైవి సుబ్బారెడ్డి చెబితేనే జరిగేది. ఇలా ఈ నలుగురు పవర్ సెంటర్లు తప్ప బిసి మంత్రులు ఏం పవర్స్ ఉండేవి. జగన్ మాటలతో ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. జగన్ పదేపదే బీసీల మాట చెబితే మాత్రం ఈ అడ్డగోలు పవర్ సెంటర్లు కచ్చితంగా చర్చకు వస్తారు.
* అధికారాలు విస్మరణ..
జగన్ రాజకీయ పదవులు ఇచ్చింది నిజం. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చింది నిజం.. మంత్రివర్గంలో చోటు కల్పించింది నిజం. కానీ వారికి అధికారాలు కల్పించలేదు అన్నది కూడా నిజమే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చింది. దానిని ఆహ్వానించాలి. ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వాలి. కానీ తాము ఇచ్చే ప్రయత్నం చేసిన అప్పట్లో చంద్రబాబు అడ్డుకున్నారని ఒకసారి.. బీసీలకు తమకంటే ఎక్కువగా ఎవరు ఆదరించలేదని.. న్యాయం చేయలేదని చెప్పడం మాత్రం అతిశయోక్తి. ఎందుకంటే పదవులు అయితే ఇచ్చారు కానీ.. వారికి ఆ స్వేచ్ఛ కల్పించలేదు. ఉత్సవ విగ్రహాలుగా ఉంచారే తప్ప.. వారికి ఎటువంటి అధికారాలు కల్పించలేదు. కానీ మేం బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం అని చెప్పేందుకు పదవులు ఇచ్చారే తప్ప.. క్షేత్రస్థాయిలో బీసీలకు వనగూరే ప్రయోజనాలు ఏవి ప్రత్యేకంగా కల్పించలేదు. పోనీ బీసీలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు, రాయితీలు లేవు. ఉన్న సంక్షేమ పథకాల్లోనే వారిని లెక్క కట్టి ఇదిగో బీసీలకు ప్రాధాన్యం అని చెప్పారే తప్ప.. మభ్యపెట్టారే తప్ప మరొకటి లేదు.