YSRCP challenges: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. ఆ పార్టీ ఆవిర్భవించి మూడుసార్లు ఎన్నికలు జరిగితే రెండుసార్లు వరుసగా విజయం సాధించిన నియోజకవర్గాలు ఉన్నాయి. 2014తో పాటు 2019లో ఏకపక్షంగా విజయం సాధించిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. కానీ మొన్నటి కూటమి ప్రభంజనంలో మాత్రం ఆ నియోజకవర్గాల్లో ఓటమి ఎదురైంది. అయితే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగనుండడంతో వైసీపీకి బలమైన నియోజకవర్గాలపై కూటమి ఫుల్ ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. 2009లో తెలుగుదేశం పార్టీని పునర్విభజనతో దెబ్బతీసింది నాటి కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా కూటమి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై అదే ఫార్ములా అనుసరించే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నేతల నియోజకవర్గాల్లో చీలిక, మండలాల విభజన, రిజర్వేషన్ల మార్పు వంటి వాటితో దెబ్బతీసే అవకాశం ఉంది.
రిజర్వుడు నియోజకవర్గాల్లో..
ముఖ్యంగా రిజర్వుడు నియోజకవర్గాల్లో( reserve constitutions ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ. 2014 రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అందుకే 2014లో ఎస్టీ నియోజకవర్గాలతో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. నాడు టిడిపి అధికారంలోకి వచ్చింది కానీ.. రిజర్వుడు నియోజకవర్గాల లో మాత్రం వైసిపి విజయాన్ని ఆపలేకపోయింది. ఇక 2019లో ఒక్క రిజర్వుడు నియోజకవర్గం కూడా గెలుచుకోలేకపోయింది టిడిపి. 2024లో మాత్రం పూర్తిగా సీన్ మారింది. కూటమి ప్రభంజనంలో రిజర్వుడు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. అయినా సరే పాడేరు, అరకు వంటి నియోజకవర్గాలతో పాటు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో వైసిపి విజయం సాధించింది. అయితే ఇప్పుడు పునర్విభజనతో రిజర్వుడ్ నియోజకవర్గాలతో పాటు వైసీపీకి బలమైన నియోజకవర్గాలను దెబ్బతీయాలని చూస్తోంది కూటమి. కచ్చితంగా నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఇప్పుడు కూటమి చేస్తుంది.
Also Read: నియోజకవర్గాల పెంపు.. ఉత్తరాంధ్రలో కొత్త లెక్కలు!
బలమైన నేతలపై గురి..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా వంటి చాలామంది నేతలు ఉన్నారు. అయితే వరుసగా రెండుసార్లు గెలిచిన వైసిపి నేతలు ఉన్నారు. దూకుడుగా వ్యవహరించే వైసిపి నేతలు ఇప్పటికీ కొనసాగుతున్నారు. అటువంటి నేతల నియోజకవర్గాలను పునర్విభజన ద్వారా దెబ్బతీయాలని చూస్తోంది కూటమి. 2009లో కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఉత్తరాంధ్రలో.. కింజరాపు, కళా వెంకట్రావు లాంటి నేతల నియోజకవర్గాలను రిజర్వేషన్ల ద్వారా దెబ్బతీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. వారి బలమైన నియోజకవర్గాలలోని మండలాలను వేరే నియోజకవర్గాల్లో చేర్చింది. రిజర్వేషన్లను సైతం మార్చేసింది. ఇప్పుడు కూడా కూటమి అదే పని చేయనుంది. తమ పార్టీకి కలిసి వచ్చే విధంగా నియోజకవర్గాల పునర్విభజనకు సిఫార్సులు చేసే అవకాశం ఉంది.
