Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసిపి అతి ప్రచారం కొంప ముంచుతుందా?

YCP: వైసిపి అతి ప్రచారం కొంప ముంచుతుందా?

YCP: విశాఖలో హోటళ్లు ఫుల్ అయ్యాయా? అస్సలు ఖాళీలు లేవా? విశాఖ వైపు వెళ్లే రైళ్లు, విమానాలు, బస్సుల టిక్కెట్లు ఆన్లైన్లో పూర్తిగా బుక్ అయ్యాయా? అసలు ఈ ప్రచారంలో నిజం ఎంత? నిజంగానే వైసీపీలో ఆ ధీమా ఉందా? ముందస్తుగా ఈ ప్రచారం ఎందుకు? గెలిచిన తర్వాత ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తే ఏంటి? ఈ ముందస్తు హడావిడి ఏంటి? నిజంగా విశాఖలో ఆ పరిస్థితి ఉందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో చర్చ నడుస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే కూటమికి అనుకూలంగా ప్రచారం జరిగింది. అది ఒక నాలుగు రోజుల వరకు కొనసాగింది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన తర్వాత పరిస్థితి మారింది. జూన్ 9న జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అది మొదలు.. అసలు విశాఖలో ఖాళీ ఉండదని.. నింగి, నేల అంతా వైసీపీ మయం అయిందని ప్రచారం ప్రారంభించారు. అయితే వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.

అప్పట్లో నేరుగా వెళ్లి హోటల్ రూములు బుక్ చేసే పరిస్థితి ఉంది. ప్రయాణం చేయాలంటే ప్రహసనమే. కానీ ఇప్పుడు అంతా ఆన్లైన్. గంటల వ్యవధిలోనే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవచ్చు. వసతి పొందవచ్చు. అయితే ఎప్పుడైతే వైసీపీ ప్రచార ఆర్భాటం ప్రారంభించిందో.. రాష్ట్రవ్యాప్తంగా ఇదో చర్చనీయాంశంగా మారింది. నిజంగా విశాఖలో హోటళ్లు దొరకడం లేదా? రైలు, బస్సుల టిక్కెట్లు దొరకడం లేదా? రిజర్వేషన్లు దొరకడం లేదా? అని ఎక్కువ మంది ఆరా తీయడం ప్రారంభించారు. కానీ ఇలా ఆరా తీయక ముందే.. హోటల్లు, రిసార్టులు తమకు తాము ఆఫర్లు ప్రకటిస్తూ ఎదురు ప్రకటనలు చేస్తున్నాయి. ఇక బస్సు సర్వీసులు అయితే.. జూన్ 9 నాటికి, అంతకుముందు నాటికి ఎక్కువ టికెట్లు ఖాళీగా చూపుతున్నాయి. దీంతో వైసీపీ చేస్తున్న ప్రచారం అతి అని తెలుస్తోంది. అది మేకపోతు గాంభీర్యంగా కనిపిస్తోంది.

ఈనెల 13న పోలింగ్ ముగిసింది. ఈవీఎంలలో ప్రజా తీర్పు నిక్షిప్తమైంది. ఈ తరుణంలో గెలుపు ఆశలు ఉంటే… జూన్ 4న ఇట్టే తెలిసిపోతుంది. గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తుంది? ఎలా చేస్తాం? ఎంత సమయానికి చేస్తాం? అన్నదికొత్త ప్రభుత్వం ప్రకటిస్తుంది. గెలుస్తామన్న ధీమా ఉన్నవారు ఇలా హంగామా చేసే ఛాన్స్ ఉండదు. 2019 ఎన్నికల్లో ఇదే మాదిరిగా తెలుగుదేశం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. పోలింగ్ నాడే గెలుస్తామని వైసిపి ధీమా వ్యక్తం చేసింది. కానీ ఇప్పటి మాదిరిగా హంగామా ఎందుకు చేయలేదు. అంతులేని విజయం వరించినా ఎందుకు ముందు గ్రహించలేకపోయింది. ఊహించని విజయం దక్కిన ఎందుకు గుర్తించలేదు. ఇప్పుడు పరిస్థితి తారుమారు అయినట్టు కనిపించినా ఈ హడావిడి ఏంటి? అయితే గెలుస్తామని ధీమాతో ఉన్న కూటమి ప్రశాంతంగా ఉంది. తన పని తాను చేసుకుంటుంది. సాధారణ పార్టీ మాదిరిగా గెలుపు పై ధీమాతో ఉంది. కానీ వైసీపీ పరిస్థితి చూస్తుంటే మాత్రం అతి అని అనిపిస్తోంది. అది ఎటువైపు దారితీస్తుందోనని వాస్తవాలను తెలుసుకునే సగటు వైసిపి అభిమానిలో మాత్రం ఆందోళన కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular