Chalamalasetty Sunil: సాధారణంగా ఎన్నికల్లో ఓటమి చవిచూస్తే.. తరువాత ఎన్నికల్లో పోటీ చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపరు. అటువంటిది ఆ నేత మూడుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ముచ్చటగా నాలుగోసారి పోటీకి దిగారు. అలాగని ఏదో చిన్నా చితకా పార్టీ నుంచి కాదు. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు అధికార పార్టీ నుంచి మరోసారి బరిలో దిగుతున్నారు. ఆయనే చలమ శెట్టి సునీల్. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగాపోటీలో ఉన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి సునీల్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోయారు. వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014లో అదే పార్టీ అభ్యర్థిగా కాకినాడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేశారు. ఎన్నికల్లో సైతం సునీల్ కు ఓటమి తప్పలేదు. 2019లో టిడిపిలోకి వచ్చిన ఆయన ఆ పార్టీ అభ్యర్థిగా ఎంపీ స్థానం నుంచి మూడోసారి పోటీలోకి దిగారు. అయినా సరే వంగా గీత చేతిలో ఓడిపోయారు. ఎన్నికల అనంతరం తిరిగి వైసీపీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ అభ్యర్థిగా మారిపోయారు.
అయితే చలమ శెట్టి సునీల్ కు పవన్ కళ్యాణ్ రూపంలో ఇబ్బందికర పరిణామం ఉంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించాలని కాకినాడ సిట్టింగ్ ఎంపీ గా ఉన్న వంగా గీతను అసెంబ్లీకి పంపించారు. ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే కాకినాడ ఎంపీ స్థానం పరిధిలోని పిఠాపురం నుంచి పవన్ పోటీలో ఉన్నారు. అక్కడ జనసేనకు భారీ మెజారిటీ ఖాయమని ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ సీటు నుంచి జనసేన అభ్యర్థిగా టీ టైం వ్యవస్థాపకులు ఉదయ్ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. అందుకే చలమశెట్టి సునీల్ కు ఈ ఎన్నికల్లో కూడా ఇబ్బందికర పరిణామాలు ఎదురవుతున్నాయి. మొత్తానికైతే విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న సునీల్ గెలిచే వరకు.. వెనక్కి తగ్గనన్న రీతిలో వ్యవహరిస్తున్నారు.