Vijaya Sai Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. కొత్త రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నెలలోనే విజయవాడలో తన రాజకీయ ప్రణాళికను ప్రకటిస్తానని తెలిపారు ఏపీలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుడతానని.. ప్రజల పక్షాన గొంతుక వినిపించేందుకు కొత్త రాజకీయ ప్రణాళిక ప్రకటిస్తానని.. పార్టీకి శ్రీవారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. గత కొంతకాలంగా ఆయన కొత్త పార్టీపై వినిపిస్తున్న వార్తలకు బలం చేకూరుస్తూ.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే విజయసాయిరెడ్డి ప్రకటన చేయడం విశేషం.
* వైసీపీకి గుడ్ బై..
ఏడాదిన్నర కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవికి సైతం రాజీనామా చేశారు. ఇక రాజకీయాలు చేయనని.. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన ఆయన మాట మీద నిలబడలేదు . కొద్ది రోజులకే యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతానని ప్రకటించారు. దీంతో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని అంతా భావించారు. ప్రచారం కూడా అలానే సాగింది. కానీ ఇప్పుడు శ్రీవారి సన్నిధిలోని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీలో చేరుతారన్న ప్రచారానికి బ్రేక్ పడినట్టే.
* డిజిటల్ మీడియా సైతం..
రాజకీయ పార్టీ ఏర్పాటుతో పాటు కొత్తగా మీడియాను ఏర్పాటు చేశారు విజయసాయిరెడ్డి. డిజిటల్ మీడియాను దాదాపు ఒక కొలిక్కి తెచ్చారు. అత్యాధునిక టెక్నాలజీతో, భారీ పెట్టుబడితో డిజిటల్ మీడియా అందుబాటులోకి రానుంది. అలాగే రాజకీయ పార్టీ ఏర్పాటుపై కూడా ఆయన మేధావులు, బ్యూరోక్రాట్లతో చర్చలు జరిపారు.. అవి ఒక కొలిక్కి రావడంతో డిజిటల్ మీడియా ప్రారంభంతో పాటు రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే విజయసాయిరెడ్డి ఏర్పాటు చేయబోయే పార్టీలో ఎవరెవరు చేరుతారు? ఆ పార్టీ విధివిధానాలు ఏంటి? అనే దానిపై బలమైన చర్చ నడుస్తోంది. ఇదే నెలలో పార్టీ ప్రకటన చేస్తానని ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో అంతటా చర్చ సాగుతోంది.
* వైసీపీలో చేరుతారని..
గత కొద్దిరోజులుగా విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీకి దగ్గరవుతున్నట్లు వార్తలు వచ్చాయి. వైసీపీ ఇబ్బందుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సైతం విజయసాయి రెడ్డికి మళ్ళీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడిచింది. ఉన్నత వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు కూడా ప్రచారం సాగింది. ప్రస్తుతం వైసీపీకి వ్యూహరచన చేసే సరైన నేతలు లేరు. అందుకే విజయసాయిరెడ్డి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏర్పడిందని.. తిరిగి ఆయన వైసీపీలో చేరిపోతారన్న హడావిడి నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు అనేది వైసిపి పై ప్రభావం చూపుతుంది అనేది వారి అనుమానం. చూడాలి మరి ఏం జరుగుతుందో..