Vemireddy meet Chandrababu Naidu: ఏపీలో ( Andhra Pradesh)రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా నెయ్యి కల్తీ వ్యవహారం అనేది ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం తన విచారణకు సంబంధించి చార్జ్ షీట్ దాఖలు చేసింది. నెయ్యి కల్తీ జరిగినట్లు స్పష్టం చేసింది. అసలు పాలు తో తయారు చేసే నెయ్యి కాదని తేల్చేసింది. పామాయిల్ తో కూడిన రసాయన మిశ్రమాలు కలిపినట్లు కూడా తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఏకసభ్య కమిషన్ ను నియమించారు. అయితే ఈ నియామకానికి ముందు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. 30 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అటు తరువాతే ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది ఏపీ ప్రభుత్వం.
* ప్రత్యేకంగా భేటీ..
వేమిరెడ్డి దంపతులు సీఎం చంద్రబాబును( CM Chandrababu) ప్రత్యేకంగా కలుసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండేవారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి పిఎ చిన్న అప్పన్న వేమిరెడ్డి తో సన్నిహితంగా ఉండేవారని.. ఇదే విషయాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అదే చిన్న అప్పన్న ఖాతాలో 4.6 కోట్ల రూపాయల నిధులు అక్రమంగా వచ్చాయి అన్నది సిబిఐ నేతృత్వంలోని సిట్ వాదన. ఈ క్రమంలో చిన్న అప్పన్న వైవి సుబ్బారెడ్డి అనుచురుడని ప్రభుత్వం చెబుతోంది. కాదు ఆయన వేమిరెడ్డి అనుచరుడుగా మారారని వైసిపి తిరిగే ఆరోపిస్తోంది.
* వైసీపీలో ఆందోళన..
అయితే ఇప్పటివరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( vemi Reddy Prabhakar Reddy ) ని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇంతవరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నోరు విప్పలేదు. అయితే తాజాగా సీఎం చంద్రబాబును కలిసిన ఆయన పూర్తిగా గుట్టు విప్పేసారని తెలుస్తోంది. అప్పట్లో జరిగిన మొత్తం వ్యవహారం పూసకు గుచ్చినట్లు చెప్పినట్లు సమాచారం. ఇంతటి బిజీ షెడ్యూల్లో సైతం వారి భేటీ దాదాపు అరగంటకు పైగా సాగింది. ఆ తరువాతే ఏక సభ్య కమిషన్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఒకవైపు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును కలవడం.. సుదీర్ఘంగా చర్చించడం.. ఏకసభ్య కమిషన్ నియామకం.. ఇవన్నీ వైసీపీలో పెను ప్రకంపనలకు కారణం అవుతున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో?