Milk Adulteration: ఏపీలో కల్తీ పాలు కలకలం సృష్టించాయి. రాజమండ్రి సమీప ప్రాంతాల్లో ఒక్కొక్కరు అస్వస్థతకు గురవుతున్నారు. ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే వీరు తాగిన పాలే వీరి అనారోగ్యానికి కారణమని వైద్యులు ధ్రువీకరించడం సంచలనంగా మారింది. ఆ పాలు తాగిన ఇద్దరు మృతిచెందగా 15 మంది వరకు ఆసుపత్రి పాలైనట్లు ప్రచారం నడుస్తోంది. రాజమండ్రి లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ సమీపంలోనే ఈ కల్తీ పాలు తాగిన వారంతా కిడ్నీ వ్యాధులకు గురైనట్లు సమాచారం. ఇద్దరు చనిపోయినట్లు ప్రచారం నడుస్తుండగా ఒకరే అని అధికారులు చెబుతున్నారు.
* వాడుక పాలతోనే..
కోరుకొండ సమీప ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పాలను లాలాచెరువు, చౌడేశ్వరి పేట సమీప ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు కొందరు. గత కొద్ది రోజులుగా ఈ పాల విక్రయం జరుగుతుండగా.. ఒక్కసారిగా ప్రజలు అనారోగ్యానికి గురికావడం ప్రారంభమైంది. మగవారికి మూత్రపిండాల సమస్య రావడం.. ఆడవారికి పర్సనల్ ప్రాబ్లమ్స్ రావడం ప్రారంభం అయ్యాయి. ఇది ఎక్కువ కావడంతో చనిపోయే వరకు పరిస్థితులు దారితీసాయి. అయితే ఇద్దరు చనిపోయినట్లు మాత్రం ప్రచారం నడుస్తోంది. అయితే ఈ వ్యాధులకు మూలం తాగే పాలు అని వైద్యాధికారుల నిర్ధారించడంతో.. పాలు పోసిన వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వ్యాధిగ్రస్తులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
* అంతటా ఇదే చర్చ..
తాజాగా రాష్ట్రంలో కల్తీ అనేది ప్రధాన అంశం కావడంతో.. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంతో పోల్చితే పాల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి ఇంట పాలును వినియోగించేవారు అధికమయ్యారు. రకరకాల అవుట్ లెట్ల పేరిట టీ విక్రయాలు కూడా జరుగుతున్నాయి. అయితే పాల సేకరణకు మించి.. పాల వినియోగం పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయం. ఇటువంటి సమయంలో పాల కల్తీ వ్యవహారం వెలుగు చూడడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రతి చోటా చర్చకు దారితీస్తోంది. ప్రభుత్వం దీనిపై సీరియస్ గా ఉంది. సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది.