Varudu Kalyani replaces Botsa: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అధినేత జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని బెంగళూరు వచ్చారు. అక్కడి నుంచి తాడేపల్లి కి చేరుకున్నారు. పార్టీ సీనియర్లతో వరుసగా సమావేశాలు జరుపుతారు. వచ్చే నెల నుంచి ఆయన జిల్లాల పర్యటనలు మొదలు పెడతారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం నుంచి ఆయన పర్యటనలు ఉంటాయని పొలిటికల్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కొత్తగా పార్టీ తరఫున ఒక నియామకం చేపడతారని తెలుస్తోంది.
సీనియర్ గా ఛాన్స్..
మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం 11చోట్ల మాత్రమే ఆ పార్టీ గెలిచింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి. కానీ శాసనమండలిలో మాత్రం 30 మందికి పైగా ఎమ్మెల్సీలు ఆ పార్టీకి ఉన్నారు. అక్కడ మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది తిరుగులేని ఆధిపత్యం. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉంది. అందుకే తనకు దక్కని ప్రతిపక్ష హోదా ఒక సీనియర్ కు ఇవ్వాలని భావించారు జగన్మోహన్ రెడ్డి. అలా బొత్స సత్యనారాయణకు చాన్స్ దక్కింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బొత్స చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ విశాఖ స్థానిక సంస్థల నుంచి బొత్సకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి.. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా ఛాన్స్ ఇచ్చారు. అలా ఒక సీనియర్ నాయకుడిగా బొత్స సముచిత స్థానాన్ని దక్కించుకున్నారు.
అనారోగ్య సమస్యలతో..
అయితే ఇటీవల తరచూ బొత్స అనారోగ్యానికి గురవుతూ వస్తున్నారు. రాజకీయాల్లో తీవ్ర ఒత్తిడికి గురవుతూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బొత్సకు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేందుకు వీలుపడటం లేదు. ఇప్పటికే కుటుంబ సభ్యులతో పాటు పిల్లలిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పని చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే బొత్సను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రియాశీలక పదవుల నుంచి విముక్తి కలిగించాలని కుటుంబ సభ్యులు అధినేత జగన్మోహన్ రెడ్డిని కోరారట. ఆయన సానుకూలంగా స్పందించారట. ఒకవేళ బొత్స వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడి పదవి నుంచి వైదొలిగితే తరువాత ఎవరు అనేది మెదులుతున్న ప్రశ్న. అయితే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు వరుదు కళ్యాణి. ఆమె వెనుకబడిన వర్గాలకు చెందినవారు. అనకాపల్లి జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. బొత్స స్థానంలో ఆమె ఎంపిక లాంఛనమేనని ప్రచారం నడుస్తోంది. అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.