Homeఆంధ్రప్రదేశ్‌Vangaveeti Asha: ఏపీలో మరో రాజకీయ వారసురాలు!?

Vangaveeti Asha: ఏపీలో మరో రాజకీయ వారసురాలు!?

Vangaveeti Asha: ఆంధ్రప్రదేశ్( Andhra Pradesh) రాజకీయాల్లో కీలక పరిణామం. మరో ప్రముఖ నేత కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. తెలుగు నాట ఎంతోమంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సక్సెస్ అయిన వారు కొంతమంది. 90వ దశకంలో ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసిన నేతలు వంగవీటి మోహన్ రంగా ఒకరు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూనే ఉంటుంది. కాపు సామాజిక వర్గం నేతగా, అణగారిన వర్గాల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. అయితే ఆయన వారసుడిగా తెరపైకి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను మోహన్ రంగా వారసురాలిగా ప్రజల్లోకి వస్తున్నట్లు ఆయన కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ప్రకటించారు. ఆదివారం తన తండ్రి వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం రాజకీయాల్లోకి వస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. రాధా రంగా మిత్రమండలి ఆహ్వానం మేరకు తాను ఇకపై కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని ప్రకటించారు.

* ప్రభావవంతమైన నేత..
ఏపీ రాజకీయాలనే ప్రభావితం చేసిన నేత వంగవీటి మోహన్ రంగా( vangaveeti Mohan Ranga). రాజకీయాల్లోకి వచ్చి కొద్ది కాలమే అయినా తనకంటూ ఒక మార్కు చూపించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ రాజకీయాలకు దిక్సూచిగా ఉండేది. అటువంటి చోట ప్రజానాయకుడిగా, అణగారిన వర్గాల నేతగా ఎదిగారు. ప్రజలతో మమేకమై పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున క్రియాశీలకంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో సైతం 1985లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1988లో టిడిపి హయాంలోనే ఆయన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో అది ఏపీలో సంచలనంగా మారింది. విజయవాడలో హింసాత్మక వాతావరణానికి కారణం అయింది. కానీ రంగా హత్యకు సంబంధించి.. ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయ సహాయం దక్కలేదు.

* రాధా తప్పటడుగులు
వంగవీటి మోహన్ రంగ వారసుడిగా రాధాకృష్ణ ( Radha Krishna) 2003లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ తరఫున 2004లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి అతి తక్కువ వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ 2009 ఎన్నికలు వచ్చేసరికి తప్పటడుగు వేశారు. చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. కానీ ఆయనకు ఓటమి పలకరించింది. 2014 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి యాక్టివ్ రోల్ ప్లే చేశారు. 2014లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆశించిన టిక్కెట్టు ఇవ్వకపోవడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. 2024 ఎన్నికల్లో టికెట్ ఆశించారు కానీ దక్కలేదు. అయినా సరే కూటమి తరుపున ప్రచారం చేశారు.

* చేరేది ఆ పార్టీలోనే?
వంగవీటి రాధాకృష్ణ అనుకున్న స్థాయిలో రాజకీయాల్లో రాణించలేకపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన సోదరి వంగవీటి ఆశ( vangaveeti Asha) రాజకీయాల్లోకి వస్తుండడం కొత్త సంచలనాలకు వేదిక కానుంది. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే తెలుగుదేశం పార్టీలో చేరిక విషయంలో భిన్న వైఖరి ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో మాత్రం అనేక సందేహాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఆమె జనసేనలో చేరుతారని మాత్రం తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకత్వాన్ని పవన్ కోరుకుంటున్నారు. జనసేన ప్రాతినిధ్యం పెరగాలని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వంగవీటి ఆశయాలు జనసేనలోకి తెప్పించి కీలక బాధ్యతలు కట్టబెడతారని తెలుస్తోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular