Vangaveeti Asha Kiran joins YCP: తెలుగు రాష్ట్రాల్లో వంగవీటి మోహన్ రంగా కు( vangaveeti Mohan Ranga) ప్రత్యేక స్థానం. ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూ హత్యకు గురయ్యారు. అయితే ఆయన మరణం ఒక సంచలనమే. టిడిపి హయాంలో ఈ హత్య జరగడం.. ఆ తర్వాత ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడం జరిగిపోయింది. అయితే వంగవీటి మోహన్ రంగ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ హత్యకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదు. కాపుల రిజర్వేషన్ కోసం.. అణగారిన వర్గాల కోసం మోహన్ రంగా చేసిన పోరాటం ఆ వర్గాల్లో చిరస్థాయిగా ఉంది. అందుకే ఆయన పేరును ప్రతి రాజకీయ పార్టీ స్మరిస్తూనే ఉంటుంది. అయితే ఆయన కుటుంబం మాత్రం రాజకీయంగా పెద్దగా రాణించకపోవడం లోటు.
* వారసుడిగా రాధాకృష్ణ..
వంగవీటి మోహన్ రంగా వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఆయన కుమారుడు రాధాకృష్ణ( vangaveeti Radha Krishna ). 2003లో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఘన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ 2009లో మాత్రం చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించడంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో కోరుకున్న సీటు ఇవ్వలేదని చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేశారు. టిడిపి ఓడిపోయేసరికి వంగవీటి మోహన్ రంగ పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఆయన టిడిపి కూటమికి మద్దతుగా ప్రచారం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో వంగవీటి రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం నడిచింది. కానీ ఇంతవరకు ఎటువంటి పదవి ఇవ్వలేదు.
* వైసీపీలోకి నో ఛాన్స్..
అయితే తాజాగా వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ ( Asha Kiran)తెరపైకి వచ్చారు. రంగా రాధా మిత్రమండలి సమన్వయ బాధ్యతలను తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఉంటుందన్న ప్రచారం కూడా ఉంది. ఈ తరుణంలో ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. త్వరలో జగన్మోహన్ రెడ్డితో సమావేశం అవుతారని కూడా టాక్ నడిచింది. తాజాగా ఆమె వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. పొలిటికల్ ఎంట్రీ కి చాలా సమయం ఉందని.. తప్పకుండా అందరితో ఆలోచించి చెబుతానని ఆమె చెప్పడం విశేషం. వైయస్సార్సీపీలో చేరడం లేదని చెప్పడం ద్వారా ఆమె ఆ పార్టీకి ఆప్షన్ లేకుండా చేశారు. అయితే ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గం కీలక భూమిక పోషిస్తుంది. ఆ అంచనా తోనే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది. అయితే సోదరుడికి భిన్నమైన రాజకీయం చేయాలనే ఉద్దేశం ఆమెలో లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తద్వారా ఆమె అడుగులు ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్సీపి వైపు ఉండవని.. కూటమిలో ఏదో ఒక పార్టీలో చేరక తప్పదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?