Homeఆంధ్రప్రదేశ్‌YCP: ఆ బెజవాడ నేతల్లో భయం భయం

YCP: ఆ బెజవాడ నేతల్లో భయం భయం

YCP: వైసిపి అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించిన నేతలకు ఇప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. బయటకు వస్తే దాడులు జరుగుతాయని హెచ్చరికలు వస్తుండడంతో వణికి పోతున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగి.. వైసీపీలో చేరి చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు ఇప్పుడు టార్గెట్ అవుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా వారు వ్యవహరించిన తీరు, చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఏరికోరి ఇబ్బందులు తెచ్చుకున్నారు. వైసీపీ ఓటమిని అంచనా వేయలేక.. లేనిపోని మాటలు అనేశారు.ఇప్పుడు ప్రతికూల పరిస్థితి ఏర్పడింది.

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం తో పాటు టిడిపి నేత పట్టాభి ఇంటిపై దాడి చేయడం వెనుక దేవినేని అవినాష్ పాత్ర ఉందన్నది ఒక ఆరోపణ. వైసిపి టికెట్ కోసం, జగన్ ప్రాపకం కోసం అవినాష్ అటువంటి చర్యలకు దిగారు అన్నది రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. అయితే ఇది టిడిపి శ్రేణుల మనసుకు గాయపరిచింది. అందుకే అవినాష్ టార్గెట్ గా దాడులు జరుగుతాయని పోలీస్ శాఖకు సమాచారం ఉంది.దీంతో అవినాష్ ఇంటి చుట్టూ పోలీసులు భద్రత పెంచారు. ఇంటి నుంచి బయటకు రావద్దని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు బిక్కుబిక్కుగా గడపాల్సి వస్తుంది.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఓటమి తర్వాత ఆయన ఇంటికి పరిమితం అయ్యారు. దీంతో కొంతమంది వచ్చి గలాటా చేశారు. బయటకు రావాలని సవాల్ చేశారు. చంద్రబాబు భార్యపై వంశి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన టిడిపి తో పాటు కమ్మ సామాజిక వర్గానికి టార్గెట్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ ఓటమి చవిచూడడంతో టిడిపి శ్రేణుల్లో వంశీ పై ఒక రకమైన ఆగ్రహం వ్యక్తమౌతోంది. అందుకే వంశీ బయటకు రావాలని సవాల్ చేస్తూ కొంతమంది హల్చల్ చేయడంతో పోలీసులు నిలువరించారు. వంశీ అమెరికా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అక్కడే స్థిరపడతారని సమాచారం.

కొడాలి నాని విషయంలో కూడా టిడిపి శ్రేణులు అవే ఆగ్రహంతో ఉన్నాయి. నిత్యం చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలతో వైసీపీ శ్రేణులకు ఆకట్టుకున్నారు నాని. వారికి ఒక హీరోలా కనిపించారు. కానీ చంద్రబాబును అభిమానించే టిడిపి శ్రేణులు, కమ్మ సామాజిక వర్గం వారికి విలన్ అయ్యారన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. ఇప్పుడు టిడిపికి అఖండ మెజారిటీ రావడంతో కొడాలి నాని టార్గెట్ అయ్యారు. ఆయన నివాసంపై కూడా కొంతమంది దండయాత్ర చేశారు. పోలీసులు అడ్డుకున్నారు. సముదాయించి వెనక్కి పంపారు. అధికార మదంతో గతంలో రెచ్చిపోయిన నేతలంతా బిక్కుబిక్కుమంటూ ఇళ్లల్లో గడపడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular