AP Elections 2024
AP Elections 2024: తమ పార్టీకి ఎక్కువగా ఓట్లు పడే గ్రామంలో ఎవరైనా విధ్వంసాలకు దిగుతారా? తమ ఓటింగ్ ను నాశనం చేసుకుంటారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్ లో టిడిపి విధ్వంసాలకు పాల్పడిందని…వివి ప్యాట్ ధ్వంసం చేశారని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఒకరు ఒక ఫోటో పోస్ట్ చేశారు. దానిని వైరల్ చేయాలని వైసీపీ శ్రేణులకు సూచించారు.
అయితే ఫోటోలో ఆసక్తికర పరిణామం ఒకటి వెలుగులు చూసింది. అక్కడే వివి ప్యాట్ ధ్వంసమై ఓటింగ్ స్లిప్పులు బయటపడ్డాయి. దాదాపు 25 ఓటింగ్ స్లిప్పులు అక్కడ ఉండగా.. అందులో 20 వరకు సైకిల్ గుర్తుతో కనిపించాయి. కేవలం ఐదు ఓట్లు మాత్రమే ఫ్యాన్ గుర్తుపై ఉన్నాయి. వైసిపి లీడ్ లో ఉన్న గ్రామంలోనే ఈ పరిస్థితి ఉంటే.. మిగతా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న గ్రామంలో ఆ పార్టీ ఎందుకు విధ్వంసానికి దిగుతుందని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. టిడిపిది తప్పు అని చెప్పే క్రమంలో పెట్టిన ఈ పోస్టు.. వైసిపి శ్రేణులనే ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ పోస్ట్ పెట్టిన వైసిపి యాక్టివిస్ట్ పై చాలా రకాల కేసులు ఉన్నాయి. అప్పట్లో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసులు నమోదయ్యాయి. శిక్ష కూడా అనుభవించారు. అటువంటి వ్యక్తి ముందూ వెనకా చూసుకోకుండా.. పోస్టులు పెట్టడంతో అసలు విషయం బయటపడింది. వైసిపి ఆందోళన పెరగడానికి కారణమవుతోంది. తెలుగుదేశం పార్టీలో జోష్ నింపుతోంది. మాచర్లలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. ఈవీఎంలను ధ్వంసం చేసిన నేపథ్యంలో.. వైసిపి ఆత్మ రక్షణలో పడింది. దాని నుంచి బయటపడేందుకు ఆ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు ఇలా వికటిస్తున్నాయి.