Wild Animals behaving strangely: అరుదైన వన్యప్రాణులకు నెలవు అభయారణ్యం శేషాచలం అటవీ ప్రాంతం. స్వామివారి వైభవంతో పాటు వచ్చే యాత్రికులకు మనోవికాసాన్ని అందిస్తుంది. అయితే ఇప్పటివరకు వన్యప్రాణులు చాలా అరుదుగా కనిపించేవి. కానీ ఇప్పుడు కొండపైకి వచ్చే భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. ఆహారంతో పాటు నీటి కోసం బయటకు వస్తూ ఇలా దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నడక మార్గంలో ఇవన్నీ ప్రాణుల తాకిడి పెరిగింది. కొద్దిరోజుల కిందట వన్యప్రాణి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఆ ఘటన ఇప్పుడిప్పుడే మరిచిపోతున్న తరుణంలో.. ఏకంగా క్యూలైన్లో ఉన్న భక్తురాలిని పాము కాటు వేయడం కలకలం రేపింది.
* తెలంగాణ భక్తురాలికి..
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని భూపాలపల్లి కి చెందిన భక్తురాలు మౌనిక రూ.300 ల క్యూ లైన్ లో ఉండగా పాము కాటేసింది. అస్వస్థతకు గురైన మౌనికను హుటాహుటిన టీటీడీ సిబ్బంది అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకువెళ్లారు. చికిత్స తర్వాత మౌనిక పూర్తిగా కోలుకుంది. వెంటనే ఆమెను స్వస్థలానికి పంపించారు. ఈ విషయంపై టిటిడి సిపిఆర్ఓ స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.
* వన్యప్రాణులకు నెలవు..
తిరుమల పరిసర ప్రాంతాలు దట్టమైన శేషాచలం అడవులు. ఇక్కడ వన్యప్రాణులు అధికంగా ఉంటాయి. అయితే వాటికి సరైన ఆహారం, నీరు దొరకకపోవడంతో తిరుమల పరిసర ప్రాంతాల్లోకి వస్తున్నాయి. తిరుమల ఫుట్ పాత్, ఇతర ప్రాంతాల్లో ఆహార వ్యర్ధాలు పెరగడం తో వాటిని తినేందుకు ఎక్కువగా వస్తున్నాయి. పైగా చిరుతలతో పాటు ఎలుగుబంట్లు, జింకలు వంటివి సురక్షితమైన ఆవాసంగా భావిస్తున్నాయి. ప్రధానంగా నడకదారి మార్గంలో ఆహార వ్యర్ధాలు, చెత్త వల్ల కుక్కలు, ఇతర జంతువులు ఈ ప్రాంతానికి వస్తాయి. వాటిని వేటాడేందుకు చిరుతలు, ఎలుగుబంట్లు జనావాసాలకు దగ్గరగా వస్తున్నాయి. అయితే అటవీ ప్రాంతం నుంచి ఏకంగా క్యూలైన్లలోకి విష పాములు వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.