Raghurama Krishnam Raju torture case: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు రఘురామకృష్ణం రాజు( AP assembly deputy speaker Raghuram Krishnam Raju) . అనూహ్యకరమైన పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యుడయ్యారు. తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవి చేపట్టారు. అయితే వైసిపి హయాంలో అదే పార్టీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణం రాజును అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై రఘురామకృష్ణంరాజు అప్పట్లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే చర్యలకు ఉపక్రమించలేదు. వైసిపి ప్రభుత్వం ఉండడంతో పట్టించుకునే వారు కరువయ్యారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు తెరపైకి వచ్చింది. రఘురామకృష్ణంరాజు ఫిర్యాదుతో మరోసారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొంతమంది ఐపీఎస్ అధికారులపై వేరే కేసులో చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ఐపీఎస్ సునీల్ కుమార్ ను పక్కన పెట్టారు. ఆయన రిటైర్ అయ్యేంతవరకు సస్పెన్షన్ లో ఉండేలా ఆదేశాలు ఇచ్చారు.
* సునీల్ నాయక్ అరెస్ట్..
మరోవైపు కస్టడీ టార్చర్ కేసులో ఈరోజు మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన.. బీహార్ ఐజిగా ఉన్న సునీల్ నాయక్ ను( Sunil Nayak ) పోలీసులు అరెస్టు చేశారు. విచారణకు హాజరుకావాలని గత కొంతకాలంగా ఏపీ పోలీసులు కోరుతున్నా.. సునీల్ నాయక్ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఏపీ పోలీసుల బీహార్ వెళ్లి ఆయనను అరెస్టు చేశారు. ఈ అరెస్టు విషయాన్ని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ధ్రువీకరిస్తూ ప్రకటన చేశారు. ప్రస్తుతం అతన్ని బీహార్ నుంచి గుంటూరుకు తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది.
* కొద్ది కాలానికే రెబెల్ గా…
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నరసాపురం నుంచి గెలిచారు రఘురామకృష్ణం రాజు. పార్లమెంటులో అడుగుపెట్టారు. కొద్ది కాలానికి ఆ పార్టీ నాయకత్వాన్ని విభేదించారు. 2021లో రఘురామకృష్ణంరాజు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే నేరుగా సీఎం పై ఆరోపణలు చేయడంతో రఘురామకృష్ణం రాజు పై రాజ ద్రోహం కేసు పెట్టి జైలుకు పంపారు. అయితే అప్పట్లో రఘురామకృష్ణం రాజు పై కస్టడీలో అధికారులు పక్కా ప్లాన్ తో దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో తనను కస్టడీలో హింసించారని రఘురామ చేసిన ఫిర్యాదు పై సుప్రీంకోర్టు సైతం స్పందించింది. ఆయనకు బెయిల్ ఇవ్వడమే కాకుండా సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య నిర్ధారణ పరీక్షల్లో సైతం నిజమేనని తేలింది. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో నిందితులపై ఎటువంటి చర్యలు లేకుండా పోయాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కదలిక వచ్చింది.
* బీహార్ క్యాడర్ అధికారి..
రఘురామకృష్ణం రాజు ను టార్చర్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఒకరు. ఈయన 2005 బ్యాచ్ కు చెందిన బీహార్ ఐపీఎస్ అధికారి. వైసిపి హయాంలో డిప్యూటేషన్ పై ఏపీకి వచ్చారు. సిఐడి విభాగంలో అత్యంత కీలక అధికారిగా కొనసాగారు. అప్పట్లో రఘురామకృష్ణం రాజును హైదరాబాదులో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లడంలో సునీల్ నాయక్ పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. రఘురామ పై జరిగిన కస్టడీ దాడిలో సిఐడి చీఫ్ పీవీ సునీల్ కుమార్ తో పాటు సునీల్ నాయక్ కూడా ప్రధాన పాత్ర పోషించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అందుకే పలుమార్లు ఆయనకు విచారణకు పిలిచారు. హాజరు కాకపోవడంతో నేరుగా బీహార్ వెళ్లి అరెస్టు చేశారు.