YCP: వైసీపీలో సంక్షోభం తప్పేలా లేదు. ఆ పార్టీలో అభ్యర్థుల మార్పు సంచలనం రేకెత్తిస్తోంది. ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. చాలామందికి టిక్కెట్లు ఇవ్వమని ముఖం మీద తేల్చేస్తుండడంతో వారంతా అసంతృప్తి బాట పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 42 మంది ఎమ్మెల్యేల మార్పు అనివార్యంగా తేలుతోంది. వీరిలో అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ 42 మంది ఎమ్మెల్యేలను బెంగళూరు తరలించినట్లు సమాచారం. టిక్కెట్లు ఎందుకు ఇవ్వమో? మీ సేవలను ఏ రీతిలో వినియోగించుకుంటామో? చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది వికటించి తిరుగుబాటుకు దారి తీసినట్లు సమాచారం.
చాలామంది ఎమ్మెల్యేలకు సొంత బలం ఉంది. కానీ గత ఎన్నికల్లో తన ఫోటోలు చూసి జనాలు ఓటు వేశారని.. అందులో మీ చరిష్మ లేదంటూ జగన్ చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా తమ సొంత బలాన్ని చూపించాలని బలంగా డిసైడ్ అయ్యారు. తమకు కానీ టిక్కెట్ నిరాకరిస్తే నియోజకవర్గాల్లో తమ ప్రతాపం చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీలో.. జనసేన ఓట్లు చీల్చడం ద్వారా.. 50 కి పైగా నియోజకవర్గాల్లో ఫలితం తారుమారయింది. ఈసారి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో కొన్ని నియోజకవర్గాల్లో వారు వన్ సైడ్ కానుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తే మాత్రం భారీ నష్టం తప్పదని వైసీపీ హై కమాండ్ ఆందోళన చెందుతోంది. అందుకే ఎమ్మెల్యేలతో నేరుగా సమావేశం కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ డోర్లు తెరిచారు.
సరిగ్గా టైం చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఎంటర్ అవుతోంది. షర్మిలకు నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని దెబ్బే. టికెట్ దక్కని ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంది. వైసీపీకి ప్రధాన ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ దే. దీంతో ఓట్లలో భారీ చీలిక వచ్చి.. టిడిపి, జనసేన కూటమికి భారీ లబ్ధి చేకూరే ఛాన్స్ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయకపోవడంతో పాటు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ప్రచారం ఉంది.
చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. చంద్రబాబు వ్యూహాలు పనిచేయడం వల్లే సాధ్యమైందని వార్తలు వచ్చాయి. అందుకే ఆయన ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తారని టాక్ నడుస్తోంది. షర్మిల ద్వారా ఏపీలో కాంగ్రెస్ విస్తరణకు ఆయన కృషి చేస్తారని తెలుస్తోంది. తద్వారా వైసిపిని దెబ్బ కొట్టి టిడిపికి లబ్ధించికూర్చడమే ధ్యేయంగా పావులు కదుపుతారని సమాచారం. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ భారీ స్కెచ్ తోనే ఏపీలో ఎంటర్ కానుంది అని తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి సంచలనం రేకెత్తించింది. కానీ అదే సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.