Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly Elections 2024: ఆంధ్రా భవిష్యత్తు తేల్చే ఎన్నిక

AP Assembly Elections 2024: ఆంధ్రా భవిష్యత్తు తేల్చే ఎన్నిక

AP Assembly Elections 2024: ఎన్నికల సమయంలో అధికార, విపక్షాలు ఎన్నో రకాల హామీలు ఇస్తాయి. ఇది ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నిక అంటూ ప్రతిపక్షం చెబుతుంది. ప్రజలకు మంచి భవిష్యత్తు ఇస్తున్నామని అధికార పక్షం చెప్పుకొస్తుంది. ప్రతి ఎన్నికల్లోనూ వినిపిస్తుంటాయి ఈ మాటలు. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తుండడంతో మరోసారి ఇవే మాటలు వినిపిస్తున్నాయి.సంక్షేమము, అభివృద్ధి అన్న మాటలు చుట్టూ ఇప్పుడు ఎన్నికలు తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు వాటిని మేనిఫెస్టోలో చేర్చుతున్నాయి. ఆకర్షణ పథకాలతో పాటు అభివృద్ధిపై హామీలు ఇస్తున్నాయి. దీంతో ప్రజలు ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉన్నారు.

ఏపీ సీఎం జగన్ విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పుకొస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని తేల్చి చెబుతున్నారు. అయితే విశాఖను కొత్తగా అభివృద్ధి చేసేందుకు ఏమీ లేదు. ఇప్పటికే అది అభివృద్ధి చెందిన నగరం. అయితేఅభివృద్ధి కంటే జగన్ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేశారు. అభివృద్ధి లేదనే అపవాదును మూటగట్టుకున్నారు. అందుకే అభివృద్ధి చెందిన విశాఖ నగరాన్ని రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. ఖర్చు లేకుండా చూసుకోవాలని భావిస్తున్నారు. అలా మిగిలిన ఖర్చుతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేయాలని భావిస్తున్నారు. అందుకే విశాఖకు ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖను రాజధానిగా చేసుకుని సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు.

ఇక చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. సహజంగా చంద్రబాబు అభివృద్ధికి ప్రాధాన్యమిస్తారు. 2014లో అమరావతి పైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. రాజధానిని అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని భావించారు. సంక్షేమాన్ని మరిచిపోయారు. ఇప్పుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. అమరావతికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఎలా చేస్తారన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మిగిలింది.

సామాన్యుడు మాత్రం అభివృద్ధిని కోరుకుంటున్నాడు. సంక్షేమ పథకాలను కొనసాగించాలని భావిస్తున్నాడు. అద్భుతమైన రాజధానిని నిర్మించాలని కోరుతున్నాడు. అయితే అవశేష ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వనరులతో ఇది సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే సామాన్యుడు కోరుతున్నట్టు ఇవన్నీ సాధ్యపడే పని కాదు. అయితే ఒక్క విధంగా చెప్పాలంటే ఆంధ్ర భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు ఇవే. ఒకరు గెలిస్తే అభివృద్ధి, మరొకరు గెలిస్తే సంక్షేమం అన్న రీతిలో పాలన సాగించే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular