TDP Mahanadu 2026: తెలుగుదేశం ( Telugu Desam)పార్టీకి మహానాడు పండుగ. ఏటా క్రమం తప్పకుండా మహానాడు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి నాడు మహానాడు నిర్వహిస్తుంటారు. మూడు రోజుల పాటు వేడుకగా జరుపుతారు కార్యక్రమాలను. ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. గత ఏడాది రాయలసీమలో నిర్వహించారు. కడప జిల్లాలో చేపట్టిన మహానాడు సక్సెస్ అయ్యింది. ఈ ఏడాది మాత్రం ఉత్తరాంధ్రలోను.. అందులోనూ శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇప్పటికే మహానాడు స్థల ఎంపికపై దృష్టి పెట్టారు. ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలోని పైడి భీమవరంలో ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. స్థల ఎంపికకు సంబంధించి నివేదికను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ కు అందించారని.. ఆయన ఫైనల్ గా తన నిర్ణయం ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది.
* పక్కా ప్రణాళికతోనే
ఉత్తరాంధ్రలో( North Andhra) మహానాడు నిర్వహణకు సంబంధించి అనేక కారణాలు ఉన్నాయి. ప్రాంతాలవారీగా మహానాడులు నిర్వహించి ఎన్నికలకు వెళ్లాలన్నది పార్టీ నాయకత్వం ప్రణాళిక. 2024 జూన్ లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. అప్పటికే సమయం ముగియడంతో ఆ ఏడాది మహానాడు నిర్వహించలేదు. 2025లో మాత్రం రాయలసీమలోని కడప జిల్లాలో నిర్వహించి అదుర్స్ అనిపించింది. ఈ ఏడాది ఉత్తరాంధ్రలో నిర్వహించి.. వచ్చే ఏడాది కోస్తాలో.. చివరిగా ఎన్నికలకు ముందు 2028లో రాయలసీమలో నిర్వహించాలన్నది ప్రణాళికగా తెలుస్తోంది. అయితే ఈసారి ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా మహానాడు చేపట్టాలని నాయకత్వం భావిస్తోంది. మూడు నుంచి ఐదు లక్షల మంది సమీకరణ చేయాలన్నది ప్రణాళికగా సమాచారం.
* ఆ కారణాలతోనే..
ఉత్తరాంధ్రలో భారీగా జనాభా పెరిగారు. ఉత్తరాంధ్రలో ఓటర్లు కూడా పెరుగుతున్నారు. యువతతో పాటు మహిళల జనాభా అధికం. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర కీలకం కూడా. అందుకే చంద్రబాబు ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర బలమైన ప్రాంతం. ఒకటి రెండు సార్లు ప్రత్యేక పరిస్థితుల్లో తప్పించి.. ప్రతి ఎన్నికల్లోనూ ఉత్తరాంధ్ర ప్రజలు టిడిపికి మెజారిటీ సీట్లు కట్టబెడుతున్నారు. అందుకే ఉత్తరాంధ్రలో టిడిపి బలం అలానే ఉంచుకునేందుకుగాను ఇక్కడ మహానాడు నిర్వహించాలని నాయకత్వం భావించినట్లు సమాచారం. మొన్ననే పార్టీ పొలిట్ బ్యూరో నుంచి జాతీయ కార్యవర్గాల వరకు ప్రకటించారు. మరో నాలుగు దశాబ్దాలపాటు టిడిపి ఉనికి చాటుకునేలా యువ నాయకత్వానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయనున్నారు.