YS Sharmila And DK Shivakumar: రాజ్యసభ పదవిపై ఆశలు పెట్టుకున్నారు షర్మిల. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి పిలుపు రావడంతో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ రాజ్యసభ భరోసా రావడంతో ఆనందంతో కనిపించారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అవుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ పదవి కష్టమేనన్న టాక్ నడుస్తోంది. దానికి కారణం లేకపోలేదు. కర్ణాటక రాజకీయాలు మారడంతో.. షర్మిలకు ఈసారి అవకాశం ఉంటుందా లేదా అనేది ఒక అనుమానం. ఎందుకంటే ఆమె కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నిక కావాలి. కానీ అక్కడ పరిస్థితి ఏమంత బాగాలేదు. అందుకే కాంగ్రెస్ అగ్ర నాయకత్వం పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే షర్మిలకు షాక్ తగిలినట్లే.
* అప్పట్లో హామీ..
తన తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేశారు షర్మిల. అక్కడ రాజకీయాల్లో రాణించాలని భావించారు. సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు. కానీ అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదు. దీంతో తన పార్టీని ఏదో ఒక జాతీయ పార్టీలో విలీనం చేయాలని భావించారు. తన తండ్రి ఇష్టపడే కాంగ్రెస్ పార్టీలోనే విలీనం చేశారు చివరకు. అలా విలీనం చేసినందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. కానీ కాంగ్రెస్ హై కమాండ్ మాత్రం ఏపీ బాధ్యతలు అప్పగించింది. అచేతనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊపిరి పోయాలని భావించింది. అందుకు అప్పట్లో రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లకు కర్ణాటక నుంచి మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతుండడంతో.. షర్మిలకు ఇచ్చిన హామీ అమలు చేసేందుకు కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. పైగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు డి కే శివకుమార్. షర్మిలకు రాజ్యసభ పదవి దక్కుతుందంటే ఆయన సైతం సంతోషిస్తారు. ఆ నమ్మకంతోనే అగ్రనేత రాహుల్ ఢిల్లీకి పిలిపించి రాజ్యసభ పదవి ఇస్తామని షర్మిలకు చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అవుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* విపరీతమైన పోటీ..
ఈరోజు కర్ణాటక సీఎం గా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే అదే కర్ణాటక నుంచి షర్మిల కు అవకాశం ఇచ్చేందుకు కాంగ్రెస్ హై కమాండ్ ఆదేశాలు జారీచేసింది. అయితే ఈ నిర్ణయంతో కర్ణాటక కాంగ్రెస్ నాయకులు అసంతృప్తికి గురవుతున్నారు. మరో రెండేళ్లలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి డీకే శివకుమార్ పనితీరుకు అజెండాగా నిలవనున్నాయి. అయితే ప్రారంభంలోనే రాజ్యసభ పదవి ద్వారా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి రేగే అవకాశం ఉంది. కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు రాజ్యసభ పదవి ఆశిస్తున్నారు. ఇప్పుడు ఆ పదవిని షర్మిలకు ఇస్తే ఆ ప్రభావం డీకే శివకుమార్ పై పడుతుంది. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ షర్మిల విషయంలో వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే షర్మిలకు షాక్ తగిలినట్టే.
