Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: ఏపీలో ఎన్నికల ఫలితాలపై రవి ప్రకాష్ స్టడీ ఎవరికెన్ని సీట్లు...

AP Elections 2024: ఏపీలో ఎన్నికల ఫలితాలపై రవి ప్రకాష్ స్టడీ ఎవరికెన్ని సీట్లు అంటే

AP Elections 2024: టీవీ9 రవి ప్రకాష్.. ఏపీలో ఎలక్ట్రానిక్ మీడియా ఆది పురుష్ గా గుర్తింపు సాధించారు ఈ జర్నలిస్ట్. కొద్దిరోజులపాటు రాజకీయాలకు బలయ్యారు. అండర్ గ్రౌండ్స్ కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆయనకు టీవీ9లో వాటాలు ఉన్నాయి. 8 శాతం వరకు మైనర్ వాటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆర్ టివి పేరుతో డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. క్రమేపి డిజిటల్ రంగంలో ఆ ఛానల్ ను విస్తరిస్తున్నారు. విస్తృతమైన నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారు. తనదైన రాజకీయ విశ్లేషణలతో ముందుకు సాగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానిపై స్టడీని ప్రకటిస్తున్నారు. ఇవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి.

ఎన్నికలు అన్నాక సర్వేలు, స్ట్రాటజీలు కామన్. కానీ వినూత్నంగా రవి ప్రకాష్ స్టడీ పేరుతో విజేతలను ప్రకటిస్తున్నారు. తన అంచనాలను వెల్లడిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా రిజల్ట్ ఎలా ఉంటుందో చెబుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. తెలంగాణలో బిజెపికి ఎనిమిది, కాంగ్రెస్ పార్టీకి 8, మజ్లిస్ కు ఒక్క లోక్ సభ సీటు వస్తుందని అంచనా వేశారు. ఇది తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. బిఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదా? అన్న చర్చ బలంగా ప్రారంభమైంది. వాస్తవ పరిస్థితి కూడా అలానే ఉందన్న అంచనాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడు అదే రవి ప్రకాష్ ఏపీ స్టడీ ని కూడా ప్రకటిస్తున్నారు. ముందుగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వెల్లడిస్తున్నారు. మూడు రోజులపాటు మూడు ప్రాంతాల స్టడీని ప్రకటిస్తున్నారు. మొదటిరోజు రాయలసీమ ఫలితాలను ప్రకటించారు. వైసిపి మెజారిటీ సీట్లను దక్కించుకుంటుందని చెప్పారు. వైసీపీకి 29, టిడిపికి 22, కాంగ్రెస్కు ఒక్క సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ స్టడీ ఇప్పుడు ఏపీలో చర్చగా మారింది. ఆయన చెబుతున్నట్టు మడకశిరలో కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథ్ కు అనుకూల పరిస్థితి ఉంది. శైలజనాథ్ గెలుపు కోసం రఘువీరారెడ్డి గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.

వాస్తవానికి వైసీపీకి రాయలసీమలోనే గట్టిపట్టు ఉంది. 2014లో ఒక్క అనంతపురం తప్పించి మిగతా మూడు జిల్లాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. గత ఎన్నికల్లో అయితే దాదాపు స్వీప్ చేసినంత పని చేసింది. టిడిపి మూడు స్థానాలకే పరిమితం అయ్యింది. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్, కుప్పం నుంచి చంద్రబాబు మాత్రమే గెలుపొందారు. అటువంటిది ఈసారి 19 సీట్లను మెరుగుపరుచుకొని.. 22 సీట్లు దక్కించుకుంటుందని రవి ప్రకాష్ స్టడీ చెబుతోంది.

ఈరోజు కోస్తాంధ్ర, రేపు ఉత్తరాంధ్ర స్టడీని రవి ప్రకాష్ ప్రకటించనున్నారు. సహజంగానే ఈ రెండు ప్రాంతాల్లో కూటమి బలంగా ఉంది. రాయలసీమలో దాదాపు కూటమి వెర్సెస్ వైసీపీ అన్న రేంజ్ లో పరిస్థితి ఉంది. వైసిపి స్వల్ప అధిక్యతలో ఉంది. ఈ లెక్క చూస్తుంటే మిగతా రెండు ప్రాంతాల్లో కూటమికి భారీ విజయం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి అయితే రవి ప్రకాష్ తన ఆర్ టీవీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలకు వేదిక అవుతున్నారు. పార్టీల వారీగా మీడియా విభజన రేఖ నేపథ్యంలో.. కొత్త ప్రయత్నంతో ముందుకు సాగుతున్నారు. ప్రజల్లో ఆసక్తి రేపుతున్నారు.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular