Raghurama Krishnam Raju Attack: ఏపీలో ( Andhra Pradesh) పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. ఏకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పై దాడికి ప్రయత్నించడం సంచలనంగా మారింది. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు పట్టణంలో శ్రీరామనవమి వేడుకలకు గాను హాజరయ్యారు రఘురామకృష్ణంరాజు. స్వామివారికి పూలమాలలు వేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆయనపై దాడి చేసేందుకు కొంతమంది ప్రయత్నం చేశారు. దానిని కూటమి శ్రేణులు అడ్డుకున్నాయి. క్షేమంగా అక్కడి నుంచి పంపించేశాయి. అనంతరం కూటమి శ్రేణులపై స్థానికులు మారణాయుధాలతో దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చేరిన వారిని రఘురామకృష్ణం రాజు పరామర్శించారు. ఏపీలో ఇది సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేతపై దాడికి ప్రయత్నం పై ఆయన సీరియస్ అయ్యారు.
* రకరకాల అనుమానాలు..
గత కొంతకాలంగా ఈ రామాలయం( ramalayam) విషయంలో వివాదం నడుస్తోంది. అందుకే దాడి జరిగినట్లు తెలుస్తోంది. కానీ రాజకీయ కారణాలతో సైతం ఈ ఘటన జరిగి ఉండవచ్చు అనే అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు ఈ ఘటనకు పాల్పడ్డారు అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామనవమి నేపథ్యంలో ఈ ఘటన జరగడంతో మతపరమైన కుట్రలకు పాల్పడ్డారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్గా స్పందించారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.
* గత కొద్ది రోజులుగా వివాదం..
వాస్తవానికి ఈ ఆలయానికి సంబంధించిన వివాదం నడుస్తోంది. రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఒక వర్గానికి రఘురామకృష్ణంరాజు( raghurama Krishnm Raju ) మద్దతు ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే డిప్యూటీ స్పీకర్ గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న రఘురామకృష్ణం రాజుకు సెక్యూరిటీ ఉంది. ఈ సెక్యూరిటీని అడ్డుకొని మరి దాడికి ప్రయత్నం జరగడం మాత్రం సంచలనంగా మారింది. దీనిపై రకరకాల రచ్చ నడుస్తోంది.. అన్య మతస్తులు దాడికి పాల్పడి ఉంటారు అనే అనుమానాలు ఉన్నాయి. రాజకీయ దాడి అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దానికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది. సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.