Mahesh Chandra Laddha
Mahesh Chandra Laddha: సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పాలనాపరమైన ముఖ్య నియామకాలను పూర్తి చేస్తున్నారు.అందులో భాగంగా కీలక విభాగం ఇంటలిజెన్స్ చీఫ్ గా మహేష్ చంద్ర లడ్డాను నియమించారు.1998 బ్యాచ్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న లడ్డా కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతూ వచ్చారు. తాజాగా ఆయనను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రబాబు ఏరి కోరి ఇంటలిజెన్స్ చీఫ్ గా లడ్డాను ఎంపిక చేశారు. సమర్థ అధికారిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఐదేళ్లుగా కేంద్ర సర్వీసులో ఉన్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం విన్నపం మేరకు కేంద్రం ఏపీకి పంపించింది. అదనపు డీజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ పోలీస్ శాఖలో ఇంటలిజెన్స్ విభాగం అత్యంత కీలకం. అందుకే సమర్ధుడైన లడ్డాను చంద్రబాబు ఎంపిక చేశారు. రాజస్థాన్ కు చెందిన లడ్డా విశాఖలో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. ప్రకాశం, గుంటూరు, నిజామాబాద్ జిల్లాలకు ఎస్పీగా పని చేశారు. ప్రకాశం జిల్లాలో పనిచేసిన సమయంలో ఆయనపై మావోయిస్టులు దాడి చేశారు. 2005 ఏప్రిల్ 27న మావోయిస్టుల దాడి నుంచి ఆయన తప్పించుకొని ప్రాణాలతో బయటపడ్డారు. మావోయిస్టుల అనిచివేతలో ఆయన కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో వారికి టార్గెట్ అయ్యారు. అటు తరువాత గుంటూరు ఎస్పీగా నియమితులయ్యారు. ఆ జిల్లాలో రౌడీయిజం ఏరివేతలో క్రియాశీలక పాత్ర పోషించారు.
మహేష్ చంద్ర లడ్డా విజయవాడ డిప్యూటీ కమిషనర్ గా కూడా సేవలందించారు. విశాఖ కమిషనర్ గా పనిచేశారు. 2019లో ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖ ఎయిర్పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా ఉన్న లడ్డా విపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ నుంచి నేరుగా సెంట్రల్ సర్వీసులకు వెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో.. సమర్థతకు పెద్దపీట వేస్తూ ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారు. కీలక బాధ్యతలను కట్టబెట్టారు.