Mahesh Babu SS Rajamouli: శీర్షిక చదివి ఆశ్చర్యపోతున్నారు కదా.. అసలు ఎన్నికల సంఘం సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు రాజమౌళికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది.. వారు ఏమైనా తప్పు చేశారా.. ఉల్లంఘనలకు పాల్పడ్డారా.. ఇంకా ఏమైనా నిబంధనలు అతిక్రమించారా.. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ కథనం చదవాల్సిందే.
కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం ఎన్నికల వ్యవస్థలో ప్రక్షాళనకు నడుము బిగించింది. ఈ క్రమంలోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిని దేశవ్యాప్తంగా అమలు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా అమలు చేసింది. ఈ నేపథ్యంలో చాలామంది ఓటర్లకు నోటీసులు జారీ చేసింది. అందులో సూపర్ స్టార్ మహేష్ బాబు.. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి.. సుప్రసిద్ధ తెలుగు క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఉన్నారు..
ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసిన వ్యక్తుల జాబితా ను పరిశీలిస్తే అందులో విఐపి కేటగిరీలో వివిఎస్ లక్ష్మణ్.. ఎస్.ఎస్.రాజమౌళి.. పుల్లెల గోపీచంద్.. సైనా నెహ్వాల్.. మిథాలీ రాజ్ వంటి వారు ఉన్నారు. మహేష్ బాబు భార్య నమ్రత.. వెంకటేష్ దగ్గుబాటి.. ఆయన ఇద్దరు కుమార్తెలు.. సమంత.. విజయ్ దేవరకొండ.. ఆనంద్ దేవరకొండ వంటి వారు ఉన్నారు.
ఎన్నికల సంఘం వీరికి నోటీసులు ఇవ్వడం వెనక ప్రత్యేకమైన కారణం ఉంది. వీరి పేర్లు జాబితాలో సరిపోలకపోవడం.. చివరి ఎస్ఐఆర్ తో మ్యాప్ కాకపోవడం.. తల్లిదండ్రుల పేర్లు సరిపోలేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. ఈ వ్యత్యాసానికి సంబంధించిన కాలం ఖాళీగా ఉంది. ఈ జాబితాలో పారిశ్రామికవేత్తలు దివి మురళీకృష్ణ ప్రసాద్.. కొణిదెల ఉపాసన కూడా ఉన్నారు. “ముఖ్యంగా వీఐపీల విషయంలో.. వారు అందుబాటులో లేకపోతే విచారణకు హాజరు కావడానికి వేరొక వ్యక్తులను నియమించే అవకాశం ఉంది. ఈ నోటీసులకు సమాధానం ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది. చాలామంది ప్రముఖులు విచారణకు హాజరు కావాల్సి ఉందని” హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్ వి కర్ణన్ పేర్కొన్నారు. వీఐపీలు ఓటర్లుగా నమోదైన అనేక అసెంబ్లీ నియోజకవర్గాలు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉండడం విశేషం.
కేవలం వీఐపీలకు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని వ్యత్యాసాలు ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశామని అధికారులు చెబుతున్నారు.. ప్రముఖులకు నోటీసులు జారీ చేసి.. వారు తమ ఓట్లను కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో సామాన్యుల పరిస్థితి ఏంటి అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి..”తెలంగాణ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో చిన్న ఇంట్లో నివసిస్తున్న ఒంటరి మహిళ పరిస్థితి ఏమిటి.. ఆమె ఓటును అధికారులు తొలగిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు అని” ఇటీవల సీజేపీ ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్త రుచిత ఆశ కమల్ పేర్కొన్నారు. నాడు ఆమె చేసిన కామెంట్లు మీడియాలో సంచలనం సృష్టించాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను మర్చిపోకముందే ఎన్నికల సంఘం తెలంగాణలో సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేయడం విశేషం.