Lokesh social media buzz: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ ఎన్నికలతో పని ఉండదు. నిత్యం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలతో వేడిగానే ఉంటుంది వాతావరణం. దీనికి తగ్గట్టు ఇప్పుడు సోషల్ మీడియా. రకరకాల ప్రచారాలకు వేదికగా మారింది. అయితే తాజాగా ఉగాదికి ఏపీలో సంచలనం నమోదు కానుంది అన్న ప్రచారం నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. మరో నాలుగు నెలల్లో రెండేళ్లు పూర్తవుతాయి. ఇటువంటి సమయంలో కూటమి నాయకత్వం మార్పు అంటూ ఒక ప్రచారం నడుస్తోంది. నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయం అని ఆ ప్రచార సారాంశం. దానికి ఉగాది లింక్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.
కొత్త సంప్రదాయం..
ఇటీవల లోకేష్( Nara Lokesh) కొత్త సంప్రదాయానికి తెర తీశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు, సీనియర్ నాయకులతో విందు ఏర్పాటు చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను పిలిచి మరి ఈ విందులో భాగస్వామ్యం చేస్తున్నారు. ఎక్కడా లేని కొత్త సాంప్రదాయం కనిపిస్తోంది లోకేష్ లో. దీంతో తెలుగుదేశం పార్టీ భావి నాయకుడిగా, కాబోయే ముఖ్యమంత్రిగా సమన్వయం చేసుకుంటున్నారని ప్రచారం నడుస్తోంది జోరుగా. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున కథనాలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఉగాదికి లింక్ పెడుతూ ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే లోకేష్ రాజకీయ పదవులు అందుకోవడం ఇదే ఉగాదితో ప్రారంభం అయింది కాబట్టి.
సరిగ్గా ఉగాది నాడు..
2009 ఎన్నికల నుంచి లోకేష్ తెలుగుదేశం( Telugu Desam) పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. ముందుగా తెర వెనుక లోకేష్ సేవలు అందేవి. 2014లో అయితే ప్రత్యక్షంగానే సేవలందించడం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో లోకేష్ ప్రస్థానం ప్రారంభం అయింది. అయితే అప్పట్లో కూడా మంత్రి అంటూ తెగ ప్రచారం నడిచింది. అయితే 2017 ఉగాదినాడు ఆయన మంత్రి గా ప్రకటించారు. తరువాత ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా లోకేష్ సీఎం అంటూ ప్రచారం నడిచింది. ఈ నేపథ్యంలో జనసేన నుంచి కొన్ని రకాల గొంతులు వినిపించాయి. దీంతో ఈ వివాదానికి ఇంతటితో పుల్ స్టాప్ వేయాలని టిడిపి తో పాటు జనసేన నాయకత్వాలు సూచించాయి. కానీ ఇప్పుడు ఉగాది వస్తుండడంతో లోకేష్ సీఎంగా బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా నడుస్తోంది.
ఇది సాధ్యమేనా?
అయితే చంద్రబాబు( CM Chandrababu) క్రియాశీలకంగా ఉండగా లోకేష్ ముఖ్యమంత్రి అంటే నమ్మేస్థితిలో లేరు. ప్రస్తుతం ఏపీ ఉన్న పరిస్థితుల్లో అది అసాధ్యమని ఎక్కువమంది తేల్చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాల అమలు చురుగ్గా సాగుతోంది. అమరావతి తో పాటు పోలవరం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకోవైపు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు పాలన అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాయకత్వం మార్పు ఉండదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరోవైపు ఇటీవల లోకేష్ ఓ సమావేశంలో దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి, కూటమికి చంద్రబాబు నాయకుడు అయితే పవన్ కళ్యాణ్ సైన్యాధిపతి అని తేల్చేశారు. మనమంతా సైనికుల్లా పనిచేయాలని మూడు పార్టీల శ్రేణులకు పిలుపునిచ్చారు కూడా.. సో లోకేష్ పై జరుగుతున్న ఉగాది ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదన్నది మెజారిటీ అభిప్రాయం. చూడాలి మరి ఏం జరుగుతుందో.