Jagan Mohan Reddy: పోలీస్ ఎలా ఉండకూడదు చెబుతాడు బ్రహ్మానందం. అంత వివరణ ఎందుకు… సింపుల్ గా నీలా ఉండకూడదు అని చెప్పు అంటాడు ఆయన బావ నాజర్. మొన్న మధ్యన జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్ షా చిత్రంలో హాస్యదృశ్యం ఇది. అయితే నిన్న రాజమండ్రి నుంచి వచ్చిన పార్టీ శ్రేణులతో జగన్మోహన్ రెడ్డి ఇవే మాటలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పై విపరీతమైన వ్యతిరేకత ఉందని.. నాలా పరిపాలిస్తే చంద్రబాబు ప్రభుత్వం పై వ్యతిరేకత వచ్చి ఉండేది కాదంటూ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు. అయితే అంత బాగా పాలించిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు. అంత బాగా పాలించాను అనే నమ్మకం జగన్మోహన్ రెడ్డిలో తొణికిసలాడుతోంది అన్నమాట. ఇప్పటికీ ఆయన తాను బాగా పాలించాను అని గుర్తు చేసుకుంటున్నారు. అదే తరహా పాలనను మరోసారి అందిస్తానని చెప్పుకొస్తున్నారు. నీ పాలన బాగాలేదు అని ప్రజలు తీర్పు చెప్పిన జగన్ వైఖరిలో మార్పు రాలేదు.
* పార్టీ శ్రేణులతో..
జగన్ వారాంతపు సమావేశాల కోసం తాడేపల్లి వస్తున్నారు. మూడు రోజులపాటు హడావిడి చేస్తున్నారు. అయితే నిన్న రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ శ్రేణులు తాడేపల్లి వచ్చారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ జోకులతో గొప్ప మైలేజీ ఇచ్చారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని రాజకీయాలు చేస్తున్న జగన్.. ఈసారి భవిష్యత్తు వ్యూహాల కంటే తన పాలనా గొప్పతనంపై సెటైరికల్ లెవెల్లో ఇచ్చిన బిల్డప్పులే పార్టీ శ్రేణులకు వినోదాన్ని పంచాయి. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అప్పుడే ఓ రేంజ్ లో వ్యతిరేకత పెరిగిపోయిందంటూ రెండు చేతులతో గాల్లో ఎత్తును కొలిచి చూపించేసరికి అక్కడున్న నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
* గతాన్ని మరిచిపోయి..
జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఓ కామెంట్ చేశారు. నాలాగా పరిపాలిస్తే అసలు ప్రభుత్వం పై వ్యతిరేకత అనేది వచ్చి ఉండేది కాదు అంటూ చాలా సీరియస్ గా డైలాగ్ చెప్పారు. గత ఎన్నికల్లో 151 సీట్ల నుంచి ఏకంగా 11 సీట్లకు కుప్పకూలిపోయి.. ఘోర పరాభవం మూటగట్టుకున్న చరిత్రను మరిచిపోయి.. తనలా పాలిస్తే వ్యతిరేకత రాదు అని ఆయన సూచిస్తున్నారు అంటే అది జోక్ అనుకోవాలా? తెలియని తనం అనుకోవాలా? అని తెలియలేదు. జగన్ అలా మాట్లాడేసరికి ఒక్కసారిగా గొల్లుమన్నారు అక్కడ ఉన్నవారు. అయితే అది జగన్ నుంచి వచ్చిన డైలాగ్ ప్రభావమా? లేకుంటే ఆయన అభిప్రాయంతో తాము ఏకీభవిస్తున్నట్టా? అన్నది మాత్రం తెలియడం లేదు.
* గుణపాఠం ఏది..
ఎవరైనా వైఫల్యాలను గుణపాఠాలుగా మార్చుకుంటారు. కానీ జగన్ ఎందుకో ఆ పని చేయడం లేదు. ఐదేళ్లపాటు బట్టలు నొక్కుతూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి.. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు అందర్నీ ఇబ్బందులకు గురి చేయడం వల్లే ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇంటికి పంపించారు. తన పాలనను నచ్చక ఆ పని చేశారని జగన్మోహన్ రెడ్డి గుర్తించకపోవడం పెద్ద తప్పు. ఇప్పటికీ తన పాలనే ప్రపంచంలో అత్యుత్తమమని ప్రచారం చేసుకోవడం పట్ల సొంత పార్టీ శ్రేణులు విస్మయం చెందుతున్నారు. మహాప్రభు మీరు మారండి అని వేడుకుంటున్నారు. కానీ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ తన పాలనే అత్యుత్తం అని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంతకంటే మించి అహంభావం ఉండదు. ఇక తేల్చుకోవాల్సింది ఆయనే.