శ్రీవారి దర్శనానికి పలు మార్గాలు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏపీఎస్ ఆర్టీసీ కూడా స్వామి వారి దర్శనానికి టికెట్లు అందుబాటులోకి తేనుంది. ప్రతి రోజు వెయ్యి టికెట్లను కేటాయించనున్నారు. ఆన్ లైన్ లో బస్ టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు అదనంగా మరో రూ.300 చెల్లించి శీఘ్ర దర్శనం టికెట్లు పొందవచ్చు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ టికెట్లపై దర్శణానికి అనుమతిస్తారు. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయంపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
తిరుమలలో జులై 17న సాయంత్రం భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శనానికి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరస్కరించడంతో భక్తులు ఆగ్రహించారు. తమకు ఏదో ఒక దర్శనం కేటాయించాలని కోరినా అధికారులు నిరాకరించడంతో టీటీడీ ఈవో కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. భక్తుల ఆందోళనతో తిరుమల కొండపై భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గత వారం రోజుల్లో భక్తులు ఇలా ఆందోళనకు దిగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
సాధారణంగా ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలతో వచ్చే వారు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలోగా అదనపు ఈవో కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది. కార్యాలయ అధికారులు వాటిని పరిశీలించి మొబైల్ కు మెసేజ్ పంపిస్తారు. అయితే ఇటీవల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు ఎక్కువైపోవడంతో అధికారులు వాటన్నింటిని పరిశీలించడంలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం తిరుమలలో రూ.300 ప్రత్యేక దర్శనాలు, వీఐపీ దర్శనాలు మాత్రమే కొనసాగుతున్నాయి. కరోనా కారణంగా ఏప్రిల్ 14 నుంచి సర్వదర్శనం టోకెన్లను పూర్తిగా నిలిపివేసింది. ప్రత్యేక దర్శనం టికెట్లను రోజుకు 5 వేలకు కుదించింది. ప్రస్తుతం నిత్యం 18 వేల వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నట్లు అంచనా. టికెట్లు, హుండీ ద్వారా కలిపి రోజుకు రూ.2 కోట్ల ఆదాయం వస్తున్నట్లు చెబుతున్నారు.
సాధారణంగా శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో 60 శాతం మేర ఉచిత దర్శనం చేసుకునే వారే ఉంటారు. కరోనా కారణంగా కేవలం టికెట్లు కొనే వారికే దర్శన అవకాశం కల్పిస్తుండడంతో సామాన్య భక్తులు ఆవేదన చెందుతున్నారు. థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పట్లో ఉచిత దర్శనాలు ఉండే అవకాశం కల్పించట్లేదు. దీంతో శ్రీవారి దర్శన భాగ్యం కోసం సామాన్యులు ఎదురుచూస్తున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More