AP Cabinet expansion: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరోవైపు ఏపీ శాసనసభ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది ఎమ్మెల్యేల మధ్య. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఖాయం అనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. మే నెలలో తప్పకుండా విస్తరణ ఉంటుందన్న టాక్ నడుస్తోంది. కొద్దిమంది మంత్రుల పనితీరు బాగా లేకపోవడంతో వారిని మార్చుతారని సమాచారం. అయితే ఇప్పటికే క్యాబినెట్లో ఒక పదవి ఖాళీ ఉంది. దానిని మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేయనున్నారు.
* ప్రధానంగా ఓ ఐదుగురు ఎమ్మెల్యేలకు క్యాబినెట్లోకి తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ప్రధానంగా డాక్టర్ బెందాళం అశోక్(Doctor Bendalam Ashok), వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కోణతాల రామకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, పల్లా శ్రీనివాస్ పేర్లు దాదాపు ఖాయమని తెలుస్తోంది. అయితే మంత్రి పదవులు నుంచి తొలగించే ఆ ఐదుగురు ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు. సామాజిక సమతూ కం పాటిస్తూ అన్ని జిల్లాలకు సమ ప్రాధాన్యం ఇస్తూ మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న ప్రచారం నడుస్తోంది. అయితే ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు ఈ ఐదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
* డాక్టర్ బెందాళం అశోక్ వరుసగా టిడిపి నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం( Ichapuram ) నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించారు. 2019 జగన్ ప్రభంజనంలో సైతం గెలిచారు. 2024 ఎన్నికల్లో గెలిచేసరికి ఆయనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందని భావించారు. కానీ శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ నేతగా ఉన్న కింజరాపు అచ్చెనాయుడుకు ఛాన్స్ ఇచ్చారు. అయితే కాలింగ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని భావించి ఇప్పుడు అశోక్ కు అవకాశం కల్పిస్తారని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది..
* నెల్లూరు జిల్లా( Nellore district) కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉండేవారు. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఆర్థికంగా కూడా అండదండగా నిలుస్తూ వచ్చారు. 2024 ఎన్నికల కు ముందు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. కానీ పార్టీ హై కమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో గౌరవం దక్కకపోవడంతో టిడిపిలో చేరారు. టిడిపి అభ్యర్థిగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. కొవ్వూరు టిడిపి అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలను గుర్తించి చంద్రబాబు ఆయన భార్య ప్రశాంతి రెడ్డిని క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: నేను క్షేమం.. బొత్స సత్యనారాయణ!
* పశ్చిమగోదావరి ( West Godavari) జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. 2014 ఎన్నికల్లో గోపాలపురం ఎస్సీ నియోజకవర్గ టికెట్ ఆశించారు. కానీ దక్కలేదు. 2016లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి టిడిపిలో పూర్తిస్థాయిలో చేరారు. 2019లో సైతం టికెట్ ఆశించారు కానీ దక్కలేదు. రాష్ట్ర లీడ్ క్యాప్ డైరెక్టర్ గా, నాయకత్వ శిక్షణ శిబిర డైరెక్టర్గా, తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల కమిటీ ఇన్చార్జిగా సేవలందించారు. 2022లో గోపాలపురం శాసనసభ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. 2024 ఎన్నికల్లో హోం శాఖ మంత్రిగా ఉంటూ, వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన తానేటి వనిత పై గెలిచారు. ఈయనను సైతం మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని ప్రచారం నడుస్తోంది.
* టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక( Gajuwaka) ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ కు సైతం మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచారు శ్రీనివాస్. దాదాపు 95 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ను ఓడించారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన దివంగత పల్లా సింహాచలం కుమారుడు. 2014లో గాజువాక నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019లో ఓడిపోయారు కానీ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగారు. అయితే రికార్డు స్థాయి విజయం సాధించిన ఆయనకు టిడిపి రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారు చంద్రబాబు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేపట్టనుండడంతో పల్లా శ్రీనివాస్ కు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది.
* మరోవైపు జనసేనకు చెందిన అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకు మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని ప్రచారం నడుస్తోంది. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్ కూడా. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రి పదవి చేపట్టారు. 1989 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి తొమ్మిది ఓట్ల తేడాతో గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి. 1991 సార్వత్రిక ఎన్నికల్లో రెండోసారి ఎంపీగా గెలిచారు. 1996లో మాత్రం అయ్యన్నపాత్రుడు చేతిలో ఓడిపోయారు. 1999లో అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2004లో మాత్రం గెలిచి రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో అమాత్య పదవి దక్కించుకున్నారు. 2009లో మాత్రం ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైయస్ విజయమ్మను విశాఖపట్నం పార్లమెంటు నుంచి పోటీ చేయించడంలో కొణతాల రామకృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి కొణతాల రామకృష్ణను దూరం పెట్టారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కొణతాల.