DWCRA Women AP: ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్. ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పించింది. తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్న ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది మహిళలకు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణాలతో పాటు నగరాల్లో ఎలక్ట్రిక్ ఆటోలకు ఎంతగానో ప్రాధాన్యత పెరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఎలక్ట్రిక్ ఆటోలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. అయితే రాయితీపై వీటిని అందించేందుకు తాజాగా నిర్ణయించారు. తక్కువ వడ్డీతో వాయిదాలు చెల్లించేలా రుణాలు కూడా వచ్చేలా చేస్తున్నారు. ఈ మేరకు మెప్మా అధికారులు డ్వాక్రా సంఘాలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చాయి. ఇప్పుడు కొత్త వారికి సైతం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
* పెరిగిన వినియోగం..
ఎలక్ట్రిక్ ఆటోలు నగరాలతో పాటు పట్టణాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రయాణికులను తరలించే వీలుగా కూడా సౌలభ్యంగా ఈ ఆటోలు రూపొందుతున్నాయి. సరుకు రవాణాకు సంబంధించి కూడా వినియోగిస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ ఆటో విలువ రూ.4.5 లక్షలు కాగా.. ప్రభుత్వం రాయితీతో రూ. 3.5 లక్షలతో అందిస్తున్నారు. లక్ష రూపాయల వరకు రాయితీ అందుతుంది. బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాన్ని కూడా ఇస్తారు. ఎలక్ట్రిక్ ఆటోలను డ్వాక్రా మహిళల కైనా, వారి కుటుంబ సభ్యులకు అయినా నడిపించి కుటుంబానికి స్వయం ఉపాధి అందించేలా.. అధికారులు చర్యలు చేపడుతున్నారు.
* ఉభయ తారకంగాను..
స్వయం ఉపాధితో పాటు పర్యావరణ పరిరక్షణకు గాను ఈ ఎలక్ట్రిక్ ఆటోలు ఎంతగానో దోహదపడతాయని భావిస్తున్నారు. గతంలో స్వయం ఉపాధి కోసం ఆటోలు కొనుగోలు చేయడానికి ప్రైవేట్ ఫైనాన్స్ ను ఆశ్రయించాల్సి వచ్చేది. అక్కడ వడ్డీ కూడా ఎక్కువ. అందుకే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం రాయితీతో పాటు తక్కువ వడ్డీకి రుణం అందిస్తున్నారు. అంతేకాకుండా డ్వాక్రా మహిళలకు రాయితీపై ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా అందిస్తున్నారు. స్కూటీ కానీ.. బైక్ కానీ తీసుకుంటే 12 వేల రూపాయల వరకు రాయితీ అందుతుంది. మొత్తానికైతే డ్వాక్రా మహిళలకు ఇది గుడ్ న్యూస్ అన్నమాట.