Homeఆంధ్రప్రదేశ్‌Amaravathi Capital : నిన్నటి వరకు చిట్టడవి.. నేడు చూడచక్కగా మారిన అమరావతి!

Amaravathi Capital : నిన్నటి వరకు చిట్టడవి.. నేడు చూడచక్కగా మారిన అమరావతి!

Amaravathi Capital : అమరావతికి కొత్త కళ వస్తోంది. దాదాపు జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కావడంతో.. అమరావతి రాజధాని యధాస్ధానానికి చేరుకొనుంది.డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 15 వేల కోట్ల రూపాయల సాయాన్ని బడ్జెట్లో ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి సర్దుబాటు చేయించింది. ఈ నిధులు సైతం విడుదల కానున్నాయి. పలుమార్లు అమరావతిని సందర్శించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు రుణం మంజూరుకు ఆమోదముద్ర వేశారు. ఇది పూర్తిస్థాయి కేంద్రం సర్దుబాటు చేసే నిధులు. కేంద్రమే హామీ ఉంటుందని.. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం మాత్రమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఆ పది శాతం నిధులు కూడా వేరే విధంగా సర్దుబాటు చేసేందుకు కేంద్రం ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిధుల సమస్య లేకుండా అమరావతిని ప్రారంభించాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా దాదాపు తుది దశకు చేరుకున్నాయి. వారం పది రోజుల్లో పూర్తికానున్నాయి. పూర్తయితే మాత్రం అమరావతి యధా స్థానానికి వచ్చినట్టే. 2019 ఎన్నికల నాటికి అమరావతి రాజధాని నిర్మాణం ఏ స్థానంలో ఉండేదో.. అదే స్థానంలోకి రానుందన్నమాట.

* ఫలితాలు వచ్చిన మరుక్షణం
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత రోజు నుంచి అమరావతికి ఒక రకమైన కొత్త శోభ వచ్చింది. ప్రధాన కార్యాలయాల చెంతన జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. రాజధాని ప్రాంతంలో విద్యుత్ లైట్లు వెలిగాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు విద్యుత్ దీప కాంతులతో అమరావతి ప్రాంతం కళకళలాడింది. కూటమి అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిందే తడువుగా పనులు ప్రారంభించారు సీఆర్డీఏ అధికారులు. మరోవైపు ఆగస్టులో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ఎందుకు గాను 36 కోట్ల రూపాయల టెండర్లను ఖరారు చేసి కాంట్రాక్టర్లకు పని బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం 96% పనులు పూర్తయినట్లు తెలుస్తోంది. వారం పది రోజుల్లో మిగతా పనులు కూడా పూర్తవుతాయని సిఆర్డిఏ అధికారులు చెబుతున్నారు.

* కూటమి రావడంతో ఊపిరి
గత ఐదేళ్లుగా అమరావతిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విడిచిపెట్టింది. అప్పట్లో రైతుల నుంచి చంద్రబాబు సర్కార్ 33 వేల ఎకరాలను సేకరించింది. అలా సేకరించిన భూమిని వేరే అవసరాలకు వాడుకోవాలని జగన్ సర్కార్ భావించింది. అదే సమయంలో అమరావతి ప్రాంత రైతులు సుదీర్ఘకాలం పోరాటం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిపై ఫోకస్ పెట్టడం, కేంద్రం సైతం ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు మంజూరు చేయడంతో.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతాయని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే వేగవంతమైన చర్యలు కనిపిస్తున్నాయి.

* 400 యంత్రాలతో పనులు
వాస్తవానికి అమరావతి జంగిల్ క్లియరెన్స్ పనులను ఎన్సిసి అనే సంస్థ దక్కించుకుంది. 36 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పనులు ప్రారంభించింది. అమరావతి ప్రాంతంలో 24 వేల ఎకరాల భూమిని 99 గ్రిడ్స్ గా విభజించి 400 యంత్రాలతో ఈ పనులు చేపట్టారు. తొలగించిన ముళ్ళ చెట్లు ఎండిపోయిన తర్వాత ముక్కలుగా కత్తిరించనున్నారు. ఇందుకుగాను హైదరాబాదు నుంచి ఎనిమిది ప్రత్యేక యంత్రాలను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. వైసిపి హయాంలో చిట్టడివిలా మారిన రాజధాని ప్రాంతం.. నేడు రహదారులు, భవనాలతో కనిపిస్తుండడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular