Homeఆంధ్రప్రదేశ్‌Kadambari Jatwani : టీడీపీ క్యాంప్ ప్రచారం చేసినట్టు.. ఆ సినీనటి సుద్ధ పూస కాదట.....

Kadambari Jatwani : టీడీపీ క్యాంప్ ప్రచారం చేసినట్టు.. ఆ సినీనటి సుద్ధ పూస కాదట.. వెనుక పే..ద్ద వలపు వల ఉందట..

Kadambari Jatwani : ఇంతటి రచ్చ జరుగుతున్నప్పుడు సహజంగానే ఒకటి రెండు రోజులు సాక్షి కాస్త నిశ్శబ్దంగా ఉంది. అలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగలేదని “తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయాం” అనే అదుర్స్ సినిమాలో డైలాగ్ ను పాటించింది.. కానీ అనూహ్యంగా జగన్ క్యాంప్ ఎదురుదాడి మొదలుపెట్టింది. సజ్జన్ జిందాల్ కాదంబరీ జెత్వానీ ని వేధించలేదని.. ఆయన నిందితుడు కాదని.. బాధితుడని సాక్షి ఏ కరువు పెడుతోంది. సజ్జన్ జిందాల్, కాదంబరీ జెత్వానీ ఎపిసోడ్ ను కథలు కథలుగా చెబుతున్న టిడిపి అనుకూల మీడియాకు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టింది. ” ఇద్దరు ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఇతర ప్రభుత్వ అధికారులు సజ్జన్ జిందాల్, కాదంబరీ జెత్వానీ వ్యవహారంలో పాలుపంచుకున్నారు. జిందాల్ స్టీల్ ఎండీ సజ్జన్ జిందాల్ ను కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను వాడుకున్నాడు. ఆడపిల్లను వేధించిన జిందాల్ ను ఆదుకున్నాడని” టిడిపి అనుకూల మీడియా రాయడంతో.. వెంటనే స్పందించిన చంద్రబాబు.. వ్యవహారంపై ఒక నివేదిక ఇవ్వాలని ఓ ఏసీపీకి బాధ్యత అప్పగించారు.. ఇక ఈ వ్యవహారంలో సాక్షి లేటుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. గట్టిగానే ఎదురుదాడి మొదలుపెట్టింది.

వలపు వల విసిరి

టిడిపి మీడియా చెబుతున్నట్టు కాదంబరి అమాయకురాలు కాదని.. ఆమె వలపు వల విసరణలో సిద్ధహస్తురాలని.. ఆమె వలలో ఎంతోమంది పేరుపొందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, ఉన్నతాధికారులు చిక్కుకున్నారని.. ఈ వ్యవహారాన్ని తెర వెనుక దుబాయ్ లో ఉండే ఆమె సోదరుడు అంబరీష్ జెత్వాని పర్యవేక్షిస్తాడని సంచలన విషయాన్ని బయటపెట్టింది. అంతేకాదు దుబాయ్ లోని అండర్ వరల్డ్ గ్యాంగ్ తో కాదంబరి జెత్వానీ, ఆమె సోదరుడికి సంబంధాలు ఉన్నాయని.. వాళ్లు కోట్లకు కోట్లు సంపాదిస్తున్నారని చెప్పుకొచ్చింది. వలపు వల విసరడంలో సిద్ధహస్తురాలైన కాదంబరి కుక్కల విద్యాసాగర్ కు హనీ ట్రాప్ లో పడేసిందంట.. దీంతో ఏపీ పోలీసులు అత్యంత డెమోక్రటిక్ గా ముంబై నుంచి ఆమెను పట్టుకొచ్చారట.. కోర్టుకు అప్పగించారట.. ఇలా చేయడం వల్ల వలపు వల గ్యాంగ్ నుంచి జిందాల్ ను రక్షించామని సాక్షి చెబుతోంది. నాడు పోలీసులు చేసిన పని సమర్థనీయమని సర్టిఫికెట్ ఇచ్చింది. అయితే ఇక్కడ సాక్షి చెప్పింది నిజం అనుకున్నప్పుడు.. కాదంబరి పై కేసు, జైలు, వేధింపులు అనంతరం.. వెంటనే అక్కడ ఆ కేసు విత్ డ్రా చేసుకున్నారంటేనే అందులో మర్మం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విద్యాసాగర్ విషయంలో ఆమెను పట్టుకొని వస్తే.. సజ్జన్ జిందాల్ కేసు విత్ డ్రా కు లంకె ఎందుకు పెట్టినట్టు.. అసలు ఆ విద్యాసాగర్ ఏడి? ఎక్కడికి వెళ్లి పోయాడు? వలపు వల గ్యాంగ్ ఆట కట్టించేందుకు పోలీసులు రంగంలోకి దిగితే.. ఆమెపై పెట్టిన కేసు ఏమైంది? 18 బ్యాంకు ఖాతాల స్వాధీనం, కాదంబరి, ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపై కేసులు పెట్టిన పోలీసులు.. తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఆమె ప్రమాదకరమైన మహిళ.. అందంతో వలవేసే మహిళ.. పెద్ద పెద్ద వారిని ఉచ్చులో బిగించే మహిళ అయినప్పుడు.. కేవలం ఏపీ పోలీసులు మాత్రమే ఎందుకు ఎంట్రీ ఇచ్చారు? ఈ ప్రశ్నలకు సాక్షి కథనంలో సమాధానాలు లేవు.

లోకేష్ కక్ష సాధింపు

లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారట? అంతేకాదు ఈ లేడిని ముందు పెట్టి జిందాల్ దగ్గర డబ్బులు వసూల్ చేసేందుకు చంద్రబాబు ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నాడట.. జగన్ ఆధ్వర్యంలో ఏర్పడిన కంపెనీలు ఇప్పుడు ఏపీ వదిలి పోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయట. అందుకే ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఈ కుట్ర చేస్తున్నారట.. ఇలా సాక్షి రకరకాలుగా వండుకుంటూ పోయింది. సహజంగానే పోలీసులు ఏదైనా తప్పు చేసినప్పుడు రకరకాల స్టోరీలు చెబుతారు.. కాదంబరీ వ్యవహారంలో సాక్షి కథనం కూడా అలానే ఉంది. మరోవైపు ఆంధ్రజ్యోతి ఈ వ్యవహారంలో మరో విషయాన్ని తెరపైకి తెచ్చింది. లోక్ అదాలత్ లో ఈ కేసు పరిష్కారం అయిందని చెబుతోంది.. అంటే ఈ లెక్కన సాక్షి చాలా విషయాలను దాచిపెడుతోందని అర్థమవుతుంది. ఇప్పటికే రఘురామరాజు గుడ్లు ఉరుముతున్నాడు. రావోయి జగన్ చూసుకుందాం అంటూ సవాలు విసురుతున్నాడు.. ఆ తలనొప్పే అలా ఉందంటే.. ఈ కదాంబరి కేసును జగన్ ఎలా ఎదుర్కొంటాడో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular