Nara Lokesh: అదిగో పులి.. ఇదిగో మేక అన్నట్టుంటుంది లోకేష్( Nara Lokesh ) విషయంలో వైసిపి అనుకూల మీడియా చేసే అతి. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. లోకేష్ పాదయాత్ర చేసే సమయంలో.. ఆ సెక్షన్ మీడియా చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.. నారా లోకేష్ ను చాలా తక్కువ చేసి చూపించేది. చివరకు వ్యక్తిత్వ హననానికి కూడా దిగింది. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు లోకేష్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సుప్రీం ఆయనే. కూటమిలోనూ కీలక పాత్ర పోషిస్తోంది ఆయనే. ప్రభుత్వంలోనూ క్రియాశీలక పాత్ర ఆయనదే. ఇటువంటి పరిస్థితుల్లో లోకేష్ ను టార్గెట్ చేసుకుంటోంది ఆ మీడియా. లోకేష్ విషయంలో ఎంతటి ప్రచారానికైనా వెనుకడుగు వేయడం లేదు. తాజాగా ఆయన వ్యక్తిగత పర్యటనలను ప్రభుత్వ ఖర్చులతో ముడి పెడుతూ ప్రచారం చేస్తోంది.
* మొన్ననే కొలంబో..
ఇటీవల లోకేష్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లను చూసేందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా మొన్ననే కొలంబో( Colombo) వెళ్లారు. ప్రపంచ టి20 టోర్నీలో భాగంగా.. శ్రీలంకలోని కొలంబోలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగింది. దానిని చూసేందుకు లోకేష్ వెళ్లారు. భారత జట్టు జెర్సీ తో పాటు జాతీయ జెండాతో మైదానం వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పనిలో పనిగా ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ అధ్యక్షుడు జై షా తో సమావేశం అయ్యారు. కీలక చర్చలు జరిపారు. అలా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో సైతం విపరీతంగా వైరల్ అయ్యాయి.
* అదంతా ఉత్త ప్రచారం..
అయితే నారా లోకేష్ ప్రభుత్వ ఖర్చులతో జల్సాలు చేస్తున్నారు అంటూ వైసీపీ అనుకూల మీడియా ప్రచారం మొదలుపెట్టింది. విమాన ఖర్చులతో పాటు విలాసాలకు ఖర్చు చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుండడంతో.. రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం దీనిపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ల వీక్షణ సమయంలో.. అస్సలు ప్రభుత్వం తరఫున ఖర్చు చేయడం లేదని.. అదంతా ఆయన వ్యక్తిగత ఖర్చు అని.. అలా జరుగుతున్న ప్రచారంలో అస్సలు నిజం లేదని తేల్చి చెప్పింది. దీంతో అదంతా ఉత్త ప్రచారం అని తేలిపోయింది. అయితే లోకేష్ విషయంలో ఇలాంటి ప్రచారం కొత్త కాదు. గతంలో కూడా ఎన్నెన్నో ప్రచారాలు చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి.