AP Politics: పార్టీలను ఆదరించడంలో ఒక్కో రాష్ట్రానిది ఒక్కో స్టైల్. కొన్ని రాష్ట్రాల్లో కులాలకు ప్రాధాన్యమిస్తారు. మరికొన్ని రాష్ట్రాల్లో మతాలకు ప్రాధాన్యమిస్తారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో అభివృద్ధికి పెద్దపీట వేస్తారు. కొన్ని రాష్ట్రాలయితే సంక్షేమ పథకాలు ఎన్ని ప్రకటిస్తే అంతలా ఆదరిస్తారు.. కానీ ఏపీలో మాత్రం ప్రజలు ఎలా ఆదరిస్తారో అన్నది ఎవరికీ అంతు పట్టడం లేదు. అభివృద్ధి చేసిన పార్టీకి పక్కన పెట్టిన సందర్భం ఉంది. అంతులేని సంక్షేమంతో పప్పు బెల్లాల్లా పంచి పెట్టినా కనికరించలేదు. అందుకే ఏపీ ప్రజల మూడ్ ఎలా ఉంటుందో కూడా చెప్పడం చాలా కష్టం. అంతెందుకు రాజకీయ విశ్లేషకులకు సైతం ఇక్కడి పరిస్థితి అంతుపట్టదు.
* శాశ్వత సంక్షేమమే చిరస్థాయిగా..
సంక్షేమంలో తాత్కాలిక సంక్షేమం ఉంది.. శాశ్వత సంక్షేమం ఉంది. నందమూరి తారక రామారావు ప్రకటించిన కిలో బియ్యం రెండు రూపాయలు అనే పథకం శాశ్వతమైనది. రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన ఆరోగ్య శ్రీ శాశ్వతమైనది. కానీ శాశ్వత పథకాలు కంటే ఈరోజుకు ఏం ఇచ్చారు అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. కేవలం ఈరోజు అవసరాలనే పరిగణలోకి తీసుకుంటున్నారు. పైగా ఎందుకు ఉచిత పథకాలు అని ప్రశ్నిస్తున్న వారే.. ఆ హామీ ఇచ్చారు కాబట్టి ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు. మరికొందరైతే ఉచిత పథకాలు దండగ అంటూనే వాటికోసం ఎగబడుతున్నారు.
* అభివృద్ధితో ఆదాయం..
సంక్షేమం అనేది విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది. రాష్ట్ర బడ్జెట్లో ప్రణాళికేతర వ్యయం. సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసే లక్షల కోట్ల రూపాయలు వెనక్కి రావు. కానీ అవే నిధులు తో అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా వాటి ద్వారా ఫల సాయం అందుతుంది. రాబడి వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రజలకు చాలా మంచి జరుగుతుంది. కానీ సంక్షేమాన్ని తగ్గించి అభివృద్ధి చేస్తామంటే ప్రజలు సమ్మతించడం లేదు. పోనీ సంక్షేమానికి పెద్ద పీఠ వేస్తామంటే అభివృద్ధి లేదు అని నిట్టూరుస్తున్నారు. అందుకే ఏపీ ప్రజల మనోగతాన్ని గుర్తించడం రాజకీయ పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుంది. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమప్రాధాన్యంగా తీసుకున్న.. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ప్రజలు ఎలా భావిస్తారో అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చారు. అభివృద్ధిని గాలికి వదిలేసారు. ఇప్పుడు చంద్రబాబు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే సమయంలో సంక్షేమంపై కూడా దృష్టి పెట్టారు. గతంలో చంద్రబాబు అంటేనే అభివృద్ధి అనేవారు తప్ప సంక్షేమానికి ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రజల మూడ్ మారడంతో.. ఆయన వైఖరి సైతం మారింది. రేపు జగన్ అధికారంలోకి వచ్చిన గతం మాదిరిగా సంక్షేమాన్ని నమ్ముకోరు. కచ్చితంగా అభివృద్ధిపై ఫోకస్ పడతారు. కానీ 2014లో తాను చేసిన పనులకు ఎదురైన పరిణామాలను.. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ చేసిన పనులను బేరిజు వేసుకొని.. చంద్రబాబు ఇప్పుడు పాలన సాగిస్తున్నారు. మరి ఈసారి ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో చూడాలి.