AP politics:ఏపీ శాసనసభ అధిపతి అయ్యన్నపాత్రుడు మొత్తానికి రాజకీయాలలో ఒక సంచలనమైన నాందికి శ్రీకారం చుట్టారు. ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టే విధంగా చెప్పే అయ్యన్న.. చివరికి తన రాజకీయ భవితవ్యంపై కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు.
వాస్తవానికి దేశవ్యాప్తంగా ఏ నాయకుడైనా సరే రాజకీయాలకు వచ్చిన తర్వాత.. రిటైర్మెంట్ అనేది తీసుకోకుండా ఉంటారు. చివరికి కాటికి కాలు చాపే వయసు వచ్చినప్పటికీ కూడా అధికారాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. అప్పట్లో బీహార్ రాష్ట్రంలో లాలు ప్రసాద్ యాదవ్ ఆస్పత్రిలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవిని వదులుకోలేదు. అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకు వెళ్లినప్పటికీ కూడా.. తన భార్యను ముఖ్యమంత్రిని చేసి.. రాజకీయాలలో ఫ్యామిలీ ప్యాకేజీ వ్యవహారం ఎలా ఉంటుందో ఆయన నిరూపించారు.
కేవలం లాలూ ప్రసాద్ యాదవ్ మాత్రమే కాదు మన తెలుగు నాటకూడా ఈ తరహా రాజకీయ నాయకులకు కొదవలేదు. అయితే అటువంటి సాంప్రదాయం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ శాసనసభ అధిపతి అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. 2029లో ఏపీ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. అప్పటికి అయ్యన్నపాత్రుడికి 73 సంవత్సరాలు వస్తాయి. కాబట్టి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అంతేకాదు.. అప్పటికి ఒకవేళ తాను రాజకీయాలలో కనుక ఉండి ఉంటే.. తినడం కష్టమవుతుందని పేర్కొన్నారు.
అయ్యన్న తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా టిడిపిలో చాలామంది సీనియర్లు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే యువకులకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వాలని టిడిపి భావిస్తోంది. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు తనకు 73 సంవత్సరాల వయసు వస్తుంది కాబట్టి అప్పటికి తాను రాజకీయాల్లోకి ఉండడం కరెక్ట్ కాదని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎంతోమంది అయ్యన్నపాత్రుడు కంటే సీనియర్ నాయకులు ఉన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కి 80 సంవత్సరాలు ఉంటాయి. ఈయన కూడా అయ్యన్నపాత్రుడితో పాటే 1983 నుంచి టిడిపిలో ఉన్నారు. మరో సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు కూడా రాజ్యసభ పదవిని కోరుకుంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. కిమిడి కళా వెంకట్రావు.. బండారు సత్యనారాయణమూర్తి వంటి వారు కూడా టిడిపిలో సీనియర్ నేతలుగా పేరు తెచ్చుకున్నారు. అయ్యన్న తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో 2029 ఎన్నికల్లో చంద్రబాబు వీరికి టికెట్ ఇస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది.