AP Local Body Elections: ఏపీలో స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. మూడు నెలల కాలంలోనే మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని భావిస్తోంది. చాలా రోజులుగా సన్నాహాలు ప్రారంభించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. షెడ్యూల్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడుతోంది. ఈ తరుణంలో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పాత పద్ధతిలోనే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్లకు కొనుగోలుతో పాటు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరింది. ఈసారికి మాత్రం ఈవీఎంలతో ఎన్నిక జరిగే పరిస్థితి లేదు అని తేలిపోయింది.
* వివిధ రాష్ట్రాల్లో ఈవీఎంలతోనే..
వివిధ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు వినియోగించారు. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం బ్యాలెట్ వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కారణం అని తెలుస్తోంది. ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పుడు ఆ తీర్పును అంగీకరించలేదు ఆ పార్టీ. ఈవీఎంల ట్యాంపరింగ్ పేరుతో చాలా రోజులపాటు సందడి చేసింది. తమ తప్పులను,, ఓటములను కప్పిపుచ్చుకోవడానికి రాజకీయ పార్టీలు ఈవీఎంలు ఒక సులువైన ఆయుధంగా ఉపయోగపడుతున్నాయి. బాలెట్ విధానం ద్వారా ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇటువంటి కుంటి సాకులకు, అనుమానాలకు చెక్ పడనుంది. ఓటింగ్ ప్రక్రియ కూడా పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం నమ్ముతోంది. అందుకే అటువైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
* వైసీపీకి అలా చెక్..
రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఏకపక్షంగా గెలవడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టవచ్చు అని భావిస్తోంది కూటమి. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలు ద్వారా గెలిచామన్న అపవాదు రాకుండా.. బ్యాలెట్ విధానంలో స్థానిక ఎన్నికలు పూర్తిచేసి.. అందులో గెలిచి గట్టి సంకేతాలు ఇవ్వాలని చూస్తోంది. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధించినప్పుడు ఈవీఎంలపై ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. 2024 లో కూటమి గెలిచేసరికి ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ లేని పోనీ హంగామా చేసింది వైసిపి. అందుకే ఈవీఎంల విశ్వసనీయతపై ఎటువంటి ప్రశ్నలు వేయలేని విధంగా.. నేరుగా బ్యాలెట్ పేపర్ల ద్వారానే పోలింగ్ నిర్వహించడం వల్ల.. వచ్చే ఫలితం ఏదైనా అది కచ్చితంగా ప్రజలు ఇచ్చే తీర్పు అని భావించేలా చేయాలని చూస్తోంది కూటమి. అందుకే ఈవీఎంల వైపు కాకుండా పాత బ్యాలెట్ విధానం వైపే మొగ్గు చూపింది.