AP Government : ఏపీ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉల్లిపాయల నుంచి నిత్యవసరాలు ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులతో పాటు మధ్యతరగతి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈ క్రమంలో నిత్యవసరాల ధరల నియంత్రణకు ఏర్పాటు అయిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, కింజరాపు అచ్చెనాయుడులతో కూడిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరలను నియంత్రించాలన్న నిర్ణయానికి వచ్చారు. వీలైనంతవరకు నిత్యవసరాలను సైతం రైతు బజార్ల ద్వారా రాయితీపై అందించేందుకు నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో.. కిలో ఉల్లిపాయలను 35 రూపాయలకి అందించనున్నారు. ప్రత్యేక కౌంటర్లను సైతం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
* మండుతున్న నిత్యవసరాల ధరలు..
ప్రస్తుతం నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. ఉల్లిపాయల ధర కిలో 70 రూపాయలు పలుకుతోంది. సన్న బియ్యంతో పాటు నూనె ధరలు కూడా పెరిగాయి. ఆపై పప్పుల ధరలు కూడా భారీగా పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఉల్లి ధర కన్నీరు పెడుతోంది. ప్రతి వంటకం లోను ఉల్లి అవసరం ఉండడంతో.. దానిపైన దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రస్తుతం 70 రూపాయల వరకు ఉల్లి ఎగబాకడంతో.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కిలో 35 రూపాయలకు అందించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఉల్లిని రాయితీపై అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
* రైతు బజార్లలో కౌంటర్లు..
గడిచిన మూడు నెలల కాలంలోనే 25 కిలోల సన్న బియ్యం బస్తా పై ధర రూ.300 పెరిగింది. దీంతో ప్రభుత్వమే రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు పెట్టి రాయితీపై బియ్యాన్ని అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 350 కౌంటర్లు ఏర్పాటు చేసి సన్నబియ్యం విక్రయాలు చేపడుతున్నారు. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా అదే మాదిరిగా అందించాలని భావిస్తున్నారు. మరోవైపు కందిపప్పుతో పాటు పామాయిల్ ను సైతం మార్కెట్ ధర కంటే పది నుంచి 20 రూపాయలు తక్కువగా విక్రయించేందుకు నిర్ణయించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలోనే నిత్యవసరాల ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో పంటలు లేవు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తం అయ్యింది. క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కార మార్గాన్ని సూచించాలని భావించింది. అన్ని రైతు బజార్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఉల్లిని రాయితీపై విక్రయించాల్సిన అవసరం ఉంది.