BJP Rajya Sabha candidate AP: రాజ్యసభ ఎన్నికలకు( Rajya Sabha elections ) సంబంధించి నగారా మోగింది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది ఇంకోవైపు ఏపీలో జూన్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీకి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటినుంచి ఆశావాహులు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కూటమి నుంచి ఎక్కువ మంది ఆశావహులు ఉన్నారు. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. జాతీయస్థాయిలో బిజెపి బలం పెంచుకునే క్రమంలో రాజ్యసభ సీట్లు తమకు విడిచి పెట్టాలని కోరుతోంది. ఇప్పటికే ఏపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యుల ఎంపిక జరగగా.. రెండు పదవులు బిజెపి తీసుకుంది. మరో రెండు పదవులు టిడిపి తీసుకుంది. తాజాగా నాలుగింటిలో ఒక పదవి కోరుతోంది బిజెపి. రెండు పదవులు టిడిపికి.. మిగిలిన మరో పదవి జనసేనకు కేటాయించేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది.
విపరీతమైన పోటీ..
అయితే ఈసారి జనసేనకు( janasena ) తొలిసారిగా రాజ్యసభలో ప్రాతినిధ్యం దక్కనుంది. ఆ పార్టీ నుంచి లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీలో సానా సతీష్ మరోసారి రెన్యువల్ కానున్నారు. ఏడాది కిందట ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. మరోసారి కొనసాగింపు ఉంటుందన్న హామీతోనే ఆయన అప్పట్లో.. తక్కువ కాలం ఉన్న రాజ్యసభ పదవి బాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీకి ఇంకా ఒక్క పదవి మిగులుతుంది. దానికోసం చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనూహ్య ఎంపికలు ఉంటాయని తెలుస్తోంది.
తెరపైకి మందకృష్ణ మాదిగ..
భారతీయ జనతా పార్టీకి ( Bhartiya Janata Party)ఒక పదవి దక్కనుంది. అయితే తమిళనాడుకు చెందిన సీనియర్ నేత అన్నామలైకు ఏపీ నుంచి ఛాన్స్ ఇస్తారని ప్రచారం నడిచింది. ఇంకోవైపు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇస్తారని కూడా టాక్ నడిచింది. మొన్నటి ఎన్నికల్లో ఆయన రాజంపేట బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నియోజకవర్గం అది. గెలుపు పై అంచనాలు లేవు. అటువంటి చోట బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చారు. అందుకే ఆయన సైతం ఈసారి రాజ్యసభ పదవి కోరుకుంటున్నారు. కానీ బిజెపి అగ్ర నాయకత్వం వేరే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మొన్ననే ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మంద కృష్ణ మాదిగకు అవకాశం ఇస్తే జాతీయస్థాయిలో మైలేజ్ పెరుగుతుందని బిజెపి ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చారు. బీసీల్లో ఆయనకు ఎంతో పట్టు ఉంది. దీంతో ఆయనను వైసిపి ముందుగా ఎంపిక చేసింది. ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకొని మరి బిజెపిలో చేరిన ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చింది బిజెపి. తెలంగాణలో మాదిగలు ఎక్కువ. ఆ వర్గానికి చెందిన మందకృష్ణ మాదిగకు రాజ్యసభ పదవి ఇస్తే.. తెలంగాణలో బలపడవచ్చు అన్నది బిజెపి పెద్దల అంచనా. చూడాలి మరి ఏం జరుగుతుందో?