Chandrababu: ఏపీలో హుందా రాజకీయాలు నడిపిస్తామని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శాసనసభ వేదికగా.. గత ఐదేళ్ల పరిస్థితులను స్మరించుకుంటూ.. అటువంటి పరిస్థితి రాకుండా చేయాలని వారు ముక్తకంఠంతో కోరారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బాధ్యతల స్వీకరణ అనంతరం.. మాట్లాడిన మూడు పార్టీల ప్రజాప్రతినిధులు ఇదే మాటను చెప్పుకొచ్చారు. గతంలో శాసనసభ వేదికగా తనకు ఎదురైన పరిణామాలను వివరించారు చంద్రబాబు. నాడు సభను బాయ్ కట్ చేయడం, తాను రోధించడంపై కూడా వివరణ ఇచ్చారు. మరోసారి మహిళలకు అగౌరవపరిచేలా ఎవరూ మాట్లాడవద్దని సభ్యులకు సూచించారు. హుందాతనం పాటిద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబు వరకు ఓకే కానీ.. మిగతా సభ్యులు శాసనసభలో, బయట హుందాగా ఉండగలరా? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ టిడిపి. ఒక విధంగా చెప్పాలంటే ఏ పార్టీ మద్దతు అవసరం లేదు. ఏకపక్షంగా ప్రభుత్వాన్ని నడపగలదు. కానీ కూటమి ప్రభుత్వంగానే ముందుకు సాగుతోంది. 166 స్థానాలతో అంతులేని మెజారిటీ కనిపిస్తోంది. అయితే ఏ పార్టీ ఎమ్మెల్యేలు తప్పు చేసిన అది అల్టిమేట్ గా ప్రభుత్వం పైనే పడుతుంది. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ఎమ్మెల్యేలు చాలామంది హుందాతప్పి మాట్లాడారు. మహిళ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు ఉన్నారు. మరోసారి అటువంటి వారు రెచ్చిపోతారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వారిని ఎలా కట్టడి చేస్తారన్నది ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న.
ఈసారి కొత్తగా 88 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. శాసనసభలో అడుగుపెట్టారు. వీరికి పాలనతో పాటు సభా సంప్రదాయాలు కూడా కొత్తే. అందుకే స్పీకర్ అయ్యన్నపాత్రుడు వీరికి శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. అయితే శాసనసభ వరకు ఓకే. టిడిపి శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు. జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ ఉంటారు. బిజెపికి సైతం పరిమిత సంఖ్యలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సభ బయట ఎమ్మెల్యేలు హుందాగా ఉంటారా? అసలు ఉండగలరా? వైసీపీ నేతలు అలా ఉంచుతారా? అన్నది ఒక ప్రశ్నగా మిగులుతోంది.జిల్లా పరిషత్ సమావేశాలు, ఐటీడీఏ మీటింగ్లు.. ఇలా చాలా జరుగుతాయి. స్థానిక సంస్థల్లో ఇంకా వైసీపీకి ప్రాతినిధ్యం ఉంది. అటువంటి సమయంలో సభ్యులు నిలదీతలు,ప్రశ్నలు ఉంటాయి.ఆ సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మరోవైపు మూడు పార్టీల ప్రజాప్రతినిధుల మధ్య కూడాసమన్వయం కొనసాగాలి. ఇలా ఏ చిన్న విషయంలో నోరు జారినా.. అవి ఇబ్బందికర పరిస్థితులకు దారి తీసే అవకాశం ఉంది. చంద్రబాబుతో పాటు పవన్ హుందా హామీ పక్కదారి పట్టే ఛాన్స్ కనిపిస్తోంది. మరి ఎలా జరుగుతుందో, ఎలా ముందుకెళ్తారో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More