AP political tweets: ఆంధ్రప్రదేశ్ లో( Andhra Pradesh) ఆసక్తికర ట్వీట్లు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చూడని, వినని మంచి సంస్కృతి కనిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ రాజకీయాల్లో మంచి సంస్కృతి కొనసాగేది. రాజకీయ పోరు అనేది సిద్ధాంత పరంగా ఉండేది. వ్యక్తిగత అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఇచ్చేవారు కాదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత.. నవ్యాంధ్రప్రదేశ్లో మాత్రం రాజకీయ వైరం అనేది పతాక స్థాయికి చేరింది. వ్యక్తిగత అంశాల జోలికి వచ్చింది. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఒక కొత్త సంస్కృతి ప్రారంభం అయింది. రాజకీయ ప్రత్యర్థులు సైతం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం.. ఒకరి ఆరోగ్యాన్ని మరొకరు కోరుకోవడం వంటివి మంచి ఆరోగ్యకర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. గత రెండు రోజులుగా పొలిటికల్ ట్వీట్లు చూస్తుంటే మాత్రం చాలా ఆనందం వేస్తోంది. ఏపీ మారింది అనడానికి సజీవ సాక్షంగా ఆ ట్వీట్లు నిలుస్తున్నాయి. అసలు ఒకరి పేరు ఒకరు తలుచుకోవడానికి ఇష్టపడని వారు సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.
సోషల్ మీడియా వచ్చాక..
సోషల్ మీడియా( social media) వచ్చాక సమాచార శాఖ పరిధి విస్తృతం అయింది. మనుషుల మధ్య బంధాలను ఈ ట్వీట్లు కలుపుతున్నాయి. ప్రముఖుల నుంచి సోషల్ మీడియా ద్వారా వచ్చే స్పందన క్షణాల్లో వైరల్ అవుతుంది. పైగా నేతలకు పెద్దగా కష్టం లేదు కూడా. వారి సోషల్ మీడియా అకౌంట్ లను ప్రైవేటు ఏజెన్సీలు నడుపుతుంటాయి. సందర్భోచితంగా, సమయానికి అనుగుణంగా సోషల్ మీడియాలో సంబంధిత సంస్థలు పోస్టులు పెడుతుంటాయి. అయితే ఇటీవల కొందరు నేతల పోస్టులు వివాదాస్పదం అవుతున్నాయి. అప్పుడు మాత్రం అది తమ తప్పు కాదని.. సోషల్ మీడియా అకౌంట్ లను నిర్వహించే ఏజెన్సీల తప్పు అని నేతలు చెబుతుంటారు. ఆ విషయాన్ని పక్కన పెడితే మాత్రం ప్రముఖుల జయంతులు, వర్ధంతుల నాడు సోషల్ మీడియా వేదికగా స్పందనలు వస్తున్నాయి. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబ సభ్యుల పుట్టినరోజులు నాడు శుభాకాంక్షలు చెబుతున్నారు.
ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు..
నిన్ననే వైయస్ విజయమ్మ( y s vijayamma ) పుట్టినరోజు. అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. సోషల్ మీడియాలో ఎటువంటి ప్రకటన చేయలేదు. బహుశా వ్యక్తిగతంగా చేసి ఉండవచ్చు. అయితే అనూహ్యంగా టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలని ఆకాంక్షించారు. ఈరోజు సీఎం చంద్రబాబు పుట్టినరోజు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంతో పాటు ప్రశాంతంగా గడపాలని ఆకాంక్షించారు. వైయస్ షర్మిల సైతం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీర్ఘాయుష్ తో గడపాలని ఆకాంక్షించారు. అయితే గతంలో ఇటువంటి సంస్కృతి ఉండేది కాదు. సోషల్ మీడియా ప్రవేశించాక ఈ ట్వీట్ల సంస్కృతి పెరిగింది. ప్రజలకు ట్విస్టులు ఇస్తున్నారు రాజకీయ పార్టీల నేతలు.