YS Sharmila : ” జగన్ మా కోసం కష్టపడ్డాడు. చెప్పినవన్నీ చేశాడు. చెప్పనివి కూడా చేశాడు. ఎన్నికల్లో మా ఓటు ఆయనకే” ఈ మాట అన్నది వైసీపీ కార్యకర్త కాదు. సాక్షి లో పనిచేసే ఉద్యోగి అంతకన్నా కాదు. రామ్ గోపాల్ వర్మ ముమ్మాటికీ కాదు.. ఈ వ్యాఖ్యలు చేసింది కడప ఓటరు. ఇంతకీ ఎవరు ముందు అన్నాడో తెలుసా..? సాక్షాత్తూ జగన్మోహన్ రెడ్డి చెల్లి ఎదుట.. ఆ ఓటరు అలా మాట్లాడేసరికి షర్మిల ముఖం చిన్నగా అయిపోయింది. దెబ్బకు ఆమె గొంతు సవరించుకుంది. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది.
విస్తృతంగా ప్రచారం చేస్తుంటే…
కడప పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. ఆమె కొద్ది రోజులుగా కడప పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే నివాసం ఉంటున్నారు. ఎలాగూ కడప ఆమె సొంత నివాసం కావడంతో పరిచయాలు బాగానే ఉన్నాయి. గత ఏడాది ఆమె తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశించడంతో కొంతకాలం కడప ప్రాంతానికి దూరంగా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆమె పాత్రను కాంగ్రెస్ పార్టీ కుదించడం.. ఏపీలో పని చేయాలని సూచించడంతో.. ఆమె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. అంతేకాదు కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు.
ఎలాగైనా గెలవాలని..
కడప పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు.. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మీద ఎలాగైనా గెలవాలని షర్మిల పట్టుదలతో ఉన్నారు. గత ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున అయితే ఆమె ప్రచారం చేశారో.. ఎవరినైతే ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారో.. ఎన్నికల్లో ఆమె వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయదని ఓటర్లకు పిలుపునిస్తున్నారు. అంతేకాదు కడప పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో షర్మిల పర్యటిస్తున్నారు.
అతడి మాటలతో..
షర్మిల తన రాజకీయ పర్యటనలో భాగంగా సోమవారం ఓటర్లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి పై విమర్శలు చేశారు. తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి పై నిప్పులు చెరిగారు. అంతేకాదు జగన్ పరిపాలనలో పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పాలంటూ ప్రజలకు మైక్ ఇచ్చారు. షర్మిల నోటి నుంచి ఆ మాట రావడంతో వేదిక మీదికి ఓ యువకుడు వచ్చాడు. షర్మిల ఇచ్చిన మైక్ అందుకున్నాడు. ” జగన్ మాకు అంతా మంచే చేశాడు. చెప్పినవన్నీ, చెప్పనివన్నీ పూర్తి చేశాడు. మా కోసం కష్టపడ్డాడు. మా విన్నపాలు విన్నాడు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ మేము గెలిపించుకుంటాం. వైసీపీకే ఓటు వేస్తాం” అని ఆ యువకుడు అనడంతో ఒకసారిగా షర్మిల ముఖం మాడిపోయింది. వెంటనే అతడి చేతిలో నుంచి మైక్ తీసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..” షర్మిలకు ఇప్పటికీ అర్థం కాకుంటే చేసేదేమీ లేదు. ఓటర్లు మొత్తం కృత నిశ్చయంతో ఉన్నారు. కచ్చితంగా జగన్ మోహన్ రెడ్డిని గెలిపిస్తారు. ఈ వీడియో చూసిన తర్వాత పచ్చ మీడియా పరిస్థితి ఏమిటో” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ మీటింగులో షర్మిల పరువు తీసిన జగన్ అభిమాని
కడపలో వైఎస్ షర్మిల ఓ కార్యకర్తని జగన్ ఏం చేసాడో చెప్పు దమ్ముంటే మాట్లాడు అని మైక్ ఇచ్చింది, ఆ కార్యకర్త మైక్ తీసుకొని సీఎం జగన్ చెప్పినవన్నీ చేశాడు..మీ మద్దతు కూడా జగన్కి ఇవ్వండని వైయస్ షర్మిలని డిమాండ్ చేశాడు. pic.twitter.com/10WYWqBV8z
— Telugu Scribe (@TeluguScribe) April 8, 2024