YSR Congress Party Capital Dispute: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజధానులపై ఒక స్టాండ్ లేదు. ఎవరు ఎప్పుడు ఏ డిమాండ్ చేస్తారో చెప్పలేకపోతున్నారు.. అది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తోంది. 2014 నుంచి 2019 మధ్య ఒకలా.. 2019 నుంచి 2024 వరకు మరోలా.. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకోలా.. ఇలా ఎవరికీ తగ్గట్టు వారు రాజధానిపై మాట్లాడుతున్నారు. అంతిమంగా అది పార్టీకి భారీగా డ్యామేజ్ చేస్తోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. దీంతో ఉత్తరాంధ్ర నాయకులు ఇప్పుడు మరోలా మాట్లాడుతున్నారు. ఇలా అయితే వెనుకబడిన ప్రాంతాలన్నీ ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్ చేస్తాయని ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు చెబుతున్నారు. బొత్స అయితే కరకట్టల మీదుగా అమరావతిని స్మశానంతో మరోసారి పోల్చారు. ఆ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీశారు.
* ధర్మాన చిడతలు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల స్టాండ్ తీసుకుంది. విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించింది. అది మొదలు అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు అయితే ఇదిగో జగన్ మనకు న్యాయం చేస్తున్నారు అంటూ గ్రామ గ్రామాల్లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఉత్తరాంధ్రకు జగన్మోహన్ రెడ్డి మంచి అవకాశం కల్పిస్తున్నారని చెప్పారు కూడా. అప్పట్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇది మంచి ప్రభుత్వంగా పొగుడుతూ మరోసారి అవకాశం కల్పించాలని ఉత్తరాంధ్ర ప్రజలను కోరారు ధర్మాన. కానీ ఇప్పుడు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తీసుకొచ్చారు. దానిపై మాత్రం మాట్లాడడం లేదు ధర్మాన. వెనుకబడిన ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చారు.
* మళ్లీ స్మశానంతో పోల్చిన బొత్స
మరోవైపు మాజీ మంత్రి బొత్స సైతం అమరావతి పై నిందిస్తూ మాట్లాడారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన నాడే బొత్స లాంటి సీనియర్ అమరావతిని స్మశానంతో పోల్చారు. అయితే తర్వాత మూడు రాజధానులు కట్టలేకపోయారు. ఇప్పుడు మరోసారి అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. అమరావతికి చట్టబద్ధత కూడా చేశారు. ఇటువంటి సమయంలో కరకట్టల మీదుగా చూస్తే అమరావతి స్మశానంలో కనిపిస్తుందని మరోసారి నోరు పారేసుకున్నారు బొత్స. అప్పట్లో మూడు రాజధానుల తీర్మానం చేసే సమయంలో విశాఖను పాలన రాజధానిగా గుర్తించడంపై జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దానిని గొప్పగా ప్రచారం చేసుకున్నారు.
* జగన్ పై నోరు తెరవని సీనియర్లు
అయితే ఉత్తరాంధ్రకు చెందిన ఈ ఇద్దరు సీనియర్లు తమ అధినేత జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన తెస్తే కనీసం మాట్లాడడం లేదు. పైగా అమరావతిలో నిధులంతా ఖర్చు పెడితే మిగతా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంటుందని చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం గురించి ప్రస్తావిస్తున్నారు. కానీ మూడు రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి మాట మార్చడాన్ని కనీసం ప్రస్తావించలేకపోతున్నారు ఈ సీనియర్లు. వీరి తీరుపై కూడా రాజకీయంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కానీ వీరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. జగన్ తెచ్చిన మావిగన్ అమరావతి చెంతనే ఉందన్న విషయాన్ని వీరు గ్రహించలేకపోతున్నారు. గ్రహించి ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించలేకపోతున్నారు. అలా అయితే మరింత డ్యామేజ్ జరుగుతుందని వారికి తెలుసు. కానీ మిగతా వైసిపి నేతలు ఈ ఇద్దరు సీనియర్ల విషయంలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.