Homeఆంధ్రప్రదేశ్‌Aadhar Card : చిన్న పిల్లలకు ఆధార్ కార్డులు.. మే 5 నుంచి ఊరూరా స్పెషల్...

Aadhar Card : చిన్న పిల్లలకు ఆధార్ కార్డులు.. మే 5 నుంచి ఊరూరా స్పెషల్ క్యాంపులు!

Aadhar Card : ఏపీలో ఆరేళ్ల లోపు చిన్నారులందరికీ ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు మే నెలలో రెండు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించనున్నారు. మొదటి విడత మే 5వ తేదీ నుంచి ప్రారంభమై 8వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండవ విడత మే 12వ తేదీ నుంచి మొదలై 15వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ప్రత్యేక శిబిరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి.

చిన్నారులకు ఆధార్ నమోదు చేయించడం చాలా సులభమైన ప్రక్రియ. తల్లిదండ్రులు కేవలం తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాన్ని (Birth Certificate) తీసుకొని శిబిరానికి హాజరైతే సరిపోతుంది. సచివాలయ సిబ్బంది అక్కడ ఉచితంగా ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎటువంటి అదనపు పత్రాలు లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read : పవన్ కళ్యాణ్ కి చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోడీ..వీడియో వైరల్!

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జనన ధ్రువీకరణ పత్రాలు పొందిన 1.07 లక్షల మంది పిల్లలకు ఇంకా ఆధార్ నమోదు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రత్యేక శిబిరాల ద్వారా వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు ఆధార్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ మీ ఆరేళ్ల లోపు పిల్లలకు ఇదివరకే ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఆ విషయాన్ని సంబంధిత సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల డేటా కచ్చితంగా తెలుస్తోంది.

ఆధార్ కార్డు అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది పిల్లలకు అనేక ప్రభుత్వ పథకాలు,సేవలను పొందడానికి అవసరం. ముఖ్యంగా పాఠశాలల్లో ప్రవేశాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి ఆధార్ తప్పనిసరి. భవిష్యత్తులో కూడా అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

ప్రత్యేక శిబిరాల పూర్తి షెడ్యూల్:
మొదటి విడత: మే 5, 6, 7, 8 తేదీలు
రెండవ విడత: మే 12, 13, 14, 15 తేదీలు

ఈ తేదీల్లో మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి మీ పిల్లల జనన ధ్రువీకరణ పత్రంతో వెళ్లి ఆధార్ నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular