Homeఆంధ్రప్రదేశ్‌Anantapur: జగన్ నమ్మి మోసపోయా.. ఉపాధ్యాయుడు సూసైడ్ నోట్ కలకలం

Anantapur: జగన్ నమ్మి మోసపోయా.. ఉపాధ్యాయుడు సూసైడ్ నోట్ కలకలం

Anantapur: అనంతపురం జిల్లాలో ఓ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ఆయన రాసిన సూసైడ్ నోట్ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని చర్చకు దారి తీసేలా చేసింది. దీనిపై ఉద్యోగ, ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. గత ఎన్నికల ముంగిట అభిమానించే వారంతా
.. విమర్శలు, తిట్ల దండకాన్ని అందుకుంటున్నారు.గతఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ ప్రకటించడంతో ఆ ఉపాధ్యాయుడు బలంగా నమ్మాడు. జగన్ పై అభిమానం పెంచుకున్నాడు. కానీ వందల వారాలు దాటిన సిపిఎస్ రద్దు కాలేదు. ఓ పి ఎస్ ను పునరుద్ధరించలేదు. దీంతో సహించలేని ఆ ఉపాధ్యాయుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఉరవకొండ మండలం చిన్న ముష్టురుకు చెందిన మల్లేష్ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గత ఎన్నికల ముందు సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆయన మాటలను విశ్వసించి మల్లేష్ జగన్ అభిమానిగా మారిపోయారు. ఈ క్రమంలో సిపిఎస్ ను జగన్ గ్యారంటీగా రద్దు చేస్తారని పందాలు కాస్తూ వచ్చారు. అది జరగకపోగా.. లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన మల్లేష్ ఆదివారం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించి సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో తోటి ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఫోన్ లొకేషన్ ద్వారా మల్లేష్ ఆచూకీ కనుగొన్నారు. ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. అనంతరం అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

దాదాపు 5 పేజీలు ఉన్న సుదీర్ఘ సూసైడ్ లేఖ రాయడం విశేషం ” విపక్ష నేతగా ఉన్న జగన్ పాదయాత్ర చేసే సమయంలో సిపిఎస్ రద్దు చేస్తానని.. ఓ పి ఎస్ ను పునరుద్ధరిస్తానని.. ఉద్యోగులకు రావాల్సిన పిఆర్సి, డిఏలు సకాలంలో ఇస్తానని హామీ ఇవ్వడంతో నమ్మాను. 2019 ఎన్నికల్లో మా కుటుంబంలోని ఓట్లన్నీ వైసీపీకే వేశాం. కానీ ఇప్పుడు బాధపడుతున్నా. కనీసం జీతాలు కూడా సరిగా వేయకుండా వేధిస్తున్నాడు. ప్రతి నెల జీతం ఆలస్యం అవుతోంది. దీంతో ఇంటి అవసరాలు సైతం తీర్చుకోలేకపోతున్నాం. పిఆర్సి విషయంలో కూడా మోసం చేశారు. అయ్యార్ 27% ఇచ్చినట్టే ఇచ్చి మళ్లీ వెనక్కి లాగేసుకున్నారు. ఇది జగన్ చేసిన అతి పెద్ద ద్రోహం. చంద్రబాబు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. జగన్ అంతకుమించి ఇస్తారనుకుంటే 23% ఇచ్చారు. రెండు డిఏలు పెట్టినందుకే చంద్రబాబును కాదనుకొని చాలా పెద్ద తప్పు చేశాం. ఆయననుకాదనుకున్నందుకు ఇప్పుడు లెంపులేసుకుంటున్నాం. రాష్ట్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ జగన్ కంటే చంద్రబాబు బెటర్ ” అని సూసైడ్ లెటర్ లో మల్లేష్ పేర్కొనడం విశేషం. తాను దసరా సెలవుల్లోనే చనిపోతానని డిసైడ్ అయ్యానని.. అప్పుడే సూసైడ్ లెటర్ రాసుకున్నానని.. తాను చనిపోతే నాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పించాలని సీఎం జగన్ ను మల్లేష్ కోరడం విశేషం. అయితే ఈ ఘటన విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జగన్ సర్కార్ తీరును ఎండగడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular