World Most Valuable Currency: పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత రూపాయి పతనమవుతోంది. ఆల్టైం కనిష్టం రూ.95కు చేరుకుంది. యుద్ధం కారణంగా ప్రపంచ మార్కెట్లు కూడా కుప్పకూలుతున్నాయి. పెట్టుబడిదారుల సంపద ఆవిరవుతోంది. చమురుధరలు పెరుగుతున్నాయి. నిత్యావసర ధరలకు రెక్కలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో కూడా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా డామినేట్ చేస్తోంది కువైట్ దినార్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా అమెరికా డాలర్ను అందరూ భావిస్తారు. కానీ, విలువ పరంగా చూస్తే కువైట్ దినార్ అగ్రస్థానంలో ఉంది. ఒక కువైట్ దినార్ విలువ సుమారు రూ.270 నుంచి రూ.285గా ఉంటుంది. అంటే, ఒక డాలర్ కంటే మూడు రెట్లు ఎక్కువ విలువ ఈ చిన్న ఎడారి దేశం కరెన్సీకి ఉంది.
కువైట్ దినార్ అంటే ఏమిటి?
కువైట్ దినార్ అరబ్ ద్వీపకల్పంలోని ఈ చిన్న, చమురు సంపన్న దేశమైన కువైట్ స్టేట్ అధికారిక కరెన్సీ. ఈ కరెన్సీని 1000 ‘ఫిల్స్’లుగా విభజించారు. 1, 5, 10, 20, 50, 100 దినార్ల నోట్లు, 5, 10, 25, 50, 100 ఫిల్స్ల నాణేలు ప్రచారంలో ఉన్నాయి.
రూపాయి నుంచి దినార్ వరకు
1961లో బ్రిటన్ నుంచి కువైట్ స్వాతంత్ర్యం పొందింది. తర్వాత ఈ కరెన్సీ అమలులోకి వచ్చింది. అంతకుముందు భారత రూపాయి అక్కడి అధికారిక కరెన్సీగా ఉండేది. 1961–1971 మధ్య బ్రిటిష్ పౌండ్కు అనుసంధానంగా ఉంది. 1971 నుంచి అమెరికా డాలర్, యూరో, యెన్ వంటి కరెన్సీల బాస్కెట్కు పెగ్ చేశారు. ఈ బాస్కెట్ కూర్పును కువైట్ సెంట్రల్ బ్యాంకు గోప్యంగా ఉంచుతుంది. 1990 ఇరాక్ ఆక్రమణ తర్వాత కువైట్ దినార్ స్థానంలో ఇరాకీ దినార్ను బలవంతంగా అమలు చేశారు. ఈ సమయంలో లక్షల విలువైన కువైట్ నోట్లను ఇరాక్ సైన్యం దోచుకుపోయింది. 1991లో యుద్ధం తర్వాత కొత్త నోట్ల శ్రేణిని విడుదల చేశారు. పాత నోట్లన్నీ రద్దు చేయడంతో దోచుకున్న నోట్లు నిరుపయోగమయ్యాయి. అప్పటి నుంచి ఈ కరెన్సీ అద్భుతమైన స్థిరత్వాన్ని ప్రదర్శిస్తోంది.
ఎందుకు ఇంత విలువ?
కువైట్ దినార్ విలువ ఇంత ఎక్కువగా ఉండటానికి కేవలం చమురు నిల్వలు మాత్రమే కారణం కాదు. అనేక ఆర్థిక, భౌగోళిక కారకాలు దీనికి తోడయ్యాయి. ప్రపంచ చమురు నిల్వల్లో సుమారు 9 శాతం కువైట్లోనే ఉన్నాయి. ఈ నిరంతర ఆదాయ ప్రవాహం దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేసింది. చమురు ఎగుమతుల ద్వారా వచ్చే భారీ ఆదాయం కరెన్సీ విలువను పెంచింది. కువైట్ తన కరెన్సీని అమెరికా డాలర్కు స్థిరమైన రేటుతో అనుసంధానించి ఉంచుతుంది. ఈ విధానం అంతర్జాతీయ వాణిజ్యంలో నమ్మకాన్ని పెంచి, మారకం రేటులో హెచ్చుతగ్గులను నివారిస్తుంది. కువైట్ ప్రభుత్వానికి ఎటువంటి ప్రజా రుణం లేదు. బడ్జెట్ ఎల్లప్పుడూ సుస్థిరంగా, మిగులుతో ఉంటుంది. దేశం వద్ద భారీ సావరిన్ వెల్త్ ఫండ్ (రిజర్వ్ నిధి) ఉంది. ఈ ఆర్థిక శిస్తు కరెన్సీపై పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచింది. కువైట్ జనాభా సుమారు 4.3 మిలియన్లు మాత్రమే. భారీ చమురు ఆదాయాన్ని తక్కువ మంది పంచుకోవడంతో తలసరి ఆదాయం ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది. ఇది కరెన్సీ కొనుగోలు శక్తిని పెంచింది. కేవలం చమురుపై ఆధారపడకుండా, కువైట్ ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెడుతోంది. ఈ వైవిధ్యీకరణ భవిష్యత్తులో చమురు ధరలు పతనమైనా కరెన్సీని కాపాడుతుంది.
భారతీయులకు కీలకం..
లక్షలాది మంది భారతీయులు కువైట్లో పనిచేస్తున్నారు. అక్కడ సగటున 1,200 దినార్లు(సుమారు రూ.3.2–3.4 లక్షలు) సంపాదిస్తే చాలు, భారత్లో గౌరవప్రదమైన జీవితం గడపవచ్చు. ఈ కరెన్సీ స్థిరత్వం కారణంగా, భారతీయ పెట్టుబడిదారులు దీనిని సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు. కువైట్ సందర్శించే భారతీయులకు మారకం రేటు లాభదాయకంగా ఉంటుంది.
ఇరాన్–అమెరికా యుద్ధం నేపథ్యంలో కువైట్ కూడా దాడులకు గురవుతోంది. ఇటీవల కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం, విద్యుత్ కేంద్రాలపై ఇరాన్ డ్రోన్ దాడులు జరిగాయి. అయినా కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థ ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఆస్తి నష్టం జరిగినా, ప్రాణనష్టం జరగలేదు. ఈ ఉద్రిక్తతల మధ్య కూడా కువైట్ దినార్ తన విలువను కోల్పోకుండా, ప్రపంచంలోనే అత్యంత స్థిరమైన, విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. ఇది ఆ దేశం ఆర్థిక నిర్వహణలో ఉన్న పటుత్వానికి నిదర్శనం.