US soldiers fear Iran tension: ఇరాన్తో యుద్ధం అమెరికా సైనికులను భయపెడుతోంది. నెలరోజులైనా యుద్ధం ముగియకపోవడంతో ఒత్తిడికి లోనవుతున్నారు. పశ్చిమాసియాలోని సైనిక స్థావరాల సమీపంలోని క్లబ్బుల్లో సైనికులు భారీగా డబ్బు ఖర్చు చేస్తూ, సేదదీరుతున్నారు.
సైనికుల్లో టెన్షన్..
యుద్ధం ఒత్తిడిలో ఉన్న అమెరికా సైనికులు స్థావరాలకు సమీపంలో ఉన్న క్లబ్బులకు నిత్యం వందల మంది వెళ్తున్నారు. క్లబ్లలో కూడా వారంతా తీవ్ర ఒత్తిడిలో, భయంలో కనిపిస్తున్నారు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు, సేదదీరేందుకు, భయం మర్చిపోయేందుకు వేల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. క్లబ్లకు వెళ్తున్నవారిలో ఎక్కువగా 20 నుంచి 25 ఏళ్లలోపువారే ఎక్కువగా ఉన్నారు. వచ్చేవారం యుద్ధభూమికి వెళ్తున్నాం అంటూ సైనికులు చెబుతున్నారు.
పశ్చిమాసియాలో మోహరింపు..
అమెరికా పశ్చిమాసియాలో సైనిక మోహరింపులను పెంచుతోంది. ఇప్పటికే 2,500 మంది మెరైన్లను, అదనపు యుద్ధ నౌకలను ప్రాంతానికి తరలించింది. గల్ఫ్ మిత్రదేశాలు ఇరాన్ను పూర్తిగా బలహీనపరిచే వరకు పోరాటం కొనసాగించాలని అమెరికాను కోరుతున్నాయి, కొందరు భూతల దాడికి ఒత్తిడి చేస్తున్నారు. ఈ యుద్ధంలో అమెరికా ప్రతిరోజూ 500 మిలియన్ నుంచి 800 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 4,500 నుంచి రూ.7,200 కోట్లు) ఖర్చు చేస్తోంది.
Also Read: ముస్లిం దేశాలకు పాకిస్తాన్ వెన్నుపోటు.. అగ్రరాజ్యానికి ఊడిగం!
మానసిక ఆరోగ్యంపై ప్రభావం
నెల రోజులకు పైగా కొనసాగుతోన్న యుద్ధం సైనికుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిరంతరం మరణ భయం, దాడుల మధ్య ఉండటం వల్ల సైనికులు తీవ్ర మానసిక ఆఘాతానికి గురవుతున్నారు. ఒత్తిడిని మర్చిపోయేందుకు మద్యం, వినోదంపై భారీగా ఖర్చు చేస్తున్నారు. నెలల తరబడి కుటుంబాల నుంచి దూరంగా ఉండటం మరింత ఒత్తిడిని కలిగిస్తోంది.
యుద్ధం కేవలం భూభాగాల కోసం, రాజకీయాల కోసం మాత్రమే కాదు. అది సాధారణ యువకుల జీవితాలను, మానసిక ఆరోగ్యాన్ని ధ్వంసం చేస్తోంది. 20 నుంచి 25 ఏళ్ల వయసులో ఉన్న అమెరికా సైనికులు, ఇరాన్ యువ యోధులు ఒకే విధమైన ఒత్తిడికి, భయానికి గురవుతున్నారు.
