Pakistan counter terrorism operations: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో భారత్ దశాబ్దాలుగా ఇబ్బంది పడుతోంది. ఒకవైపు అంతర్గతంగా నక్సలిజం.. మరోవైపు పాకిస్తాన్ ఉగ్రవాదులు దేశానికి అతిపెద్ద సమస్యగా మారాయి. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దేశంలో వేళ్లూనుకున్న నక్సలిజం, మావోయిస్టులను కూకటి వేళ్లతో పెకిలించే ప్రయత్నం చేసింది. మార్చి 31 నాటికి దాదాపు 90 శాతం మావోయిస్టులు లొంగిపోయారు. మిగిలినవారు కూడా అదేబాటలో ఉన్నారు. అగ్రనేత గణపతి లొంగిపోతే మావోయిస్టులు ముగిసినట్లే. ఈ క్రమంలో కేంద్రం పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర లింక్కుల కత్తిరింపు.. పాకిస్తాన్లోని ఉగ్రవాదులను టార్గెట్ చేసింది. దేశంలోని ఉగ్రవాదులను, ఓవర్ గ్రౌండ్ నెట్ వర్క్లను ఏరివేస్తోంది. ఇదే సమయంలో పాకిస్తాన్లో దురంధర్ సినిమా తరహాలో అజ్ఞాత సాయుధులు భారత వ్యతిరేక ఉగ్రవాదులను లేపేస్తున్నారు. ఇప్పటికే వంద మందికిపైగా ఉగ్రవాదులను సాయుధుల మట్టుబెట్టారు. దీంతో పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద మూకలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో లష్కరే–ఎ–తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కు అత్యంత సన్నిహితుడైన షేక్ యూసుఫ్ అఫ్రీదిని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పాక్ వ్యాప్తంగా గత కొంతకాలంగా ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతుండటం ఉగ్రవాద సంస్థల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఉగ్రవాదులను టార్గెట్ చేసిన అజ్ఞాత వ్యక్తులు..
గత కొంతకాలంగా పాకిస్తాన్ కేంద్రంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రనేతలు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. గతంలో ముఫ్తీ హబీబుల్లా హక్కానీ, షేక్ మోయిజ్ ముజాహిద్, అబూ ఖతల్ వంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు సైతం ఇలాగే గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హతమయ్యారు. ఈ తరహా ఘటనలు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఇప్పుడు సురక్షితమైన ఆశ్రయం కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అభద్రతలో ఉగ్రవాద సంస్థలు
పాక్ ఆర్మీ రక్షణలో ఉన్నామని భావించే ఉగ్రనేతలకు కూడా ఈ పరిణామాలు నిద్రలేకుండా చేస్తున్నాయి. లాహోర్ వంటి నగరాల నడిబొడ్డున కూడా ఉగ్రవాద నేతలపై కాల్పులు జరగడం, పాకిస్తాన్ భద్రతా వ్యవస్థల వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. ఒకప్పుడు భారత్లో మారణహోమానికి పాల్పడిన నేతలు ఇప్పుడు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాల్లో భయాందోళనలను పెంచడమే కాకుండా, వారి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
