Modi Gulf Strategy: ప్రపంచ వాణిజ్య యుద్ధాలు, ట్రంప్ టారిఫ్ వార్తో ప్రపంచ వ్యాప్తంగా సప్లయ్ చైన్ దెబ్బతింటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారత్పై ట్రంప్ 2.0 విధించిన టారిఫ్లతో ఫార్మా, టెక్సటైల్, జెమ్స్ తదితర రంగాలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. చాలా మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ తరుణంలో మోదీ తన చాణక్యంతో వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టారు. అమెరికాను మించిన ఒప్పందాలు చేసుకుంటూ టారిఫ్ల ప్రభావం భారత్పై పడకుండా చేశారు. ఆస్ట్రేలియా, యూకే, యూఏఈ, యురోపియన్ యూనియన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో షాక్ అయిన ట్రంప్ ఇప్పుడు దిగి వచ్చారు. భారత్తో వాణిజ్య ఒప్పందానికి సై అంటున్నారు. అదీ మనం చెప్పినట్లుగా, మన కండీషన్స్ అంగీకరిస్తూనే.
గల్ఫ్ దేశాలపై ఫోకస్..
ప్రపంచ వాణిజ్య యుద్ధాల మధ్య భారత్, యూరోపియన్ యూనియన్, అమెరికాతో ఒప్పందాల తర్వాత గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లోని ఆరు దేశాలతో ఫ్రీ ట్రేడ్ ఒప్పంద చర్చలు ప్రారంభించింది. యూఏఈ, ఒమాన్తో ఇప్పటికే అమలులో ఉన్న ఒప్పందాలు ఆధారంగా, సౌదీ అరేబియా, ఖతర్, కువైత్, బహ్రెయిన్తో సంబంధాలు బలోపేతమవుతాయి. ఈ చొరవ భారత విదేశీ వ్యాపార వ్యూహానికి కొత్త ఊపిరి పోస్తుంది.
ఎగుమతులు, పెట్టుబడుల ఊపు..
ఒప్పందం విజయవంతమైతే, ఆహార ఉత్పత్తులు, ఫార్మా, టెక్నాలజీ ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. గల్ఫ్ దేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్లు మాన్యుఫాక్చరింగ్, ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ప్రవేశిస్తాయి. ఇది ఉద్యోగాలు, జీడీపీ వృద్ధికి దోహదపడుతుంది. ఇప్పటికే యూఏఈతో విస్తరణ జరిగిన మోడల్, మిగతా దేశాలకు మార్గదర్శకంగా పనిచేస్తుంది.
వ్యూహాత్మక ప్రాముఖ్యత..
గల్ఫ్ దేశాలు ప్రపంచ ఇంధన వనరుల 40% నియంత్రిస్తున్నాయి. ఈ ఒప్పందం భారత ఇంధన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వాణిజ్య రక్షణను పెంచుతుంది. గల్ఫ్ దేశాలు ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థల నుంచి డైవర్సిఫై అవుతున్న సమయంలో, భారత మార్కెట్ వారికి ఆకర్షణీయంగా మారుతోంది. ఇది ద్వైపాక్షిక వ్యాపారాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంది.
టారిఫ్ ఆంక్షలు, నిబంధనల సమన్వయం సవాళ్లుగా ఉన్నాయి. అయితే, వ్యూహాత్మక బలం, మ్యూచువల్ లాభాలు చర్చలను వేగవంతం చేస్తాయి. విజయం సాధిస్తే, భారత వాణిజ్యం మెరుగుపడుతుంది. గ్లోబల్ అనిశ్చితుల మధ్య భారత ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తుంది.
