Matrimony Fraud: డబ్బు ఉన్నవారిని గుర్తించి, వారిని బుట్టలో వేసుకుకోవడం, హనీట్రాప్ ద్వారా.. బ్లాక్మెయిల్ చేయడం.. తర్వాత ఉన్నదంతా ఊడ్చుకోవడం వంటి ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులు డబ్బుల కోసం ఈలాంటి చర్యలకు దిగుతున్నారు. తాజాగా వివాహ వేదిక ద్వారా పరిచయమైన ఓ మహిళ అత్యంత చాకచక్యంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజినీరును నిలువునా ముంచింది. ఆ వ్యక్తిని బెదిరించి రూ.1.14 కోట్లు బ్యాంకు ఖాతాకు మార్పించుకున్న ఘటన సంచలనంగా మారింది. మహిళ వేధింపులు భరించలేక బాధితుడు స్థానిక వైట్ఫీల్డ్ పోలీసుఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణం స్పందించి ఆమె ఖాతాలో ఉన్న రూ.80 లక్షలు డ్రా చేసుకోకుండా కట్టడి చేశారు.
లండన్లో జాబ్..
లండన్లోని ఓ సంస్థలో పని చేస్తున్న ఆ సాఫ్ట్వేర్ ఉన్నతోద్యోగి శిక్షణలో భాగంగా బెంగళూరు వచ్చాడు. ఇక్కడే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనతో ఓ ప్రైవేట్ వివాహ వేదికలో తన పేరు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలోనే సాన్వి అరోరా అనే మహిళ ఆయనకు పరిచయమైంది. ఈనెల 7న ఆమె ఆయనకు వీడియో కాల్ చేసింది. ఈ సందర్భంగా సెక్సువల్గా ప్రేరేపించింది. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి పూర్తిగా ఆమెకు లొంగిపోయాడు. పెళ్లి చేసుకుంటాం కదా అని అన్నీ విప్పి చూపించాడు. ఈ క్రమంలో అతని న్యూడ్ ఫొటోలు, వీడియోలు షూట్ చేసింది.
మరుసటి రోజు నుంచే వేధింపులు..
మరుసటి రోజు నుంచి ఆమె వాలకం మారిపోయింది. ముందు రోజు ‘చిత్రాలు’ ఆయనకు వాట్సప్లో షేర్చేసింది. వాటిని చూసి కంగుతినడం ఆ సాఫ్ట్వేర్ వంతైంది. కాస్త డబ్బు ఇస్తే.. ఇవన్నీ ఎవరికీ చూపనంటూ హెచ్చరించింది. అలా.. ఏకంగా రూ.1.14 కోట్లు గుంజేసింది. ఇంకా కావాలంటూ ఆమె డబ్బు కోసం డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
రంగంలోకి దిగిన పోలీసులు..
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదులో బెంగళూరు పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే సదరు మహిళ కోసం ఆరా తీయడం ప్రారంభించారు. ఫోన్ నంబర్ ఆధారంగా సదరు కిలేడీని గుర్తించారు. అంతటితో ఆగకుండా.. ఆమె ఖాతాను బ్లాక్ చేయించారు. రూ.1.14 కోట్లు లాగగా, ప్రస్తుతం ఆమె ఖాతాలో రూ.80 లక్షలు ఉన్నట్లు తెలిపారు. వాటిని డ్రా చేసుకోకుండా చర్యలు తీసుకున్నారు. ఆమె మోసాన్ని ప్రాథమికంగా నిర్ధారించుకుని దర్యాప్తు ప్రారంభించారు.