
TSPSC Chairman Janardhan Reddy: ఏఈ పేపర్ లీక్ కేసులో టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు.. కార్యాలయంలో సమర్థంగా పనిచేసే సిబ్బంది కొరత ఉండటం, బయట నుంచి విమర్శలు వస్తున్నడంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కమిషన్ చైర్మన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై రాజకీయ పార్టీలతో పాటు విద్యార్ధి సంఘాలు కూడా పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. జనార్దన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నాయి.
వాస్తవానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో తగినంత సిబ్బంది లేరు. ప్రస్తుతం కార్యాలయంలో 83 మంది రెగ్యులర్ సిబ్బంది పనిచేస్తున్నారు. సాధారణంగా ఒక ఏడాదిలో అత్యధికంగా రెండు నుంచి మూడు వేల పోస్టులు భర్తీ చేసిన రికార్డు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు ఉంది. కానీ ఈ ఎడాదికంగా 23 వేల పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో గ్రూప్ 1, 2, 3, 4 వంటి ముఖ్యమైన పోస్టులూ ఉన్నాయి.
కమిషన్ చైర్మన్ తో పాటు ఇతర సిబ్బంది పైన తీవ్రమైన ఒత్తిడి ఉంది.. వాస్తవానికి ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేపడుతున్న పనుల కోసం జనార్దన్ రెడ్డి అర్ధరాత్రి వరకు కార్యాలయంలోనే ఉంటున్నారు.. నియామకాల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొంతమంది ఉద్యోగుల వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తోంది అని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా తన రాజీనామాకు డిమాండ్ చేస్తుండటంతో ఆయన మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద ప్రస్తావిస్తూ పదవి నుంచి తప్పుకుంటే ఎలా ఉంటుందని అంటున్నారు. అయితే ఇప్పుడే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని, దీనివల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయని సన్నిహితులు వారిస్తున్నారు.

ఇక పేపర్ లీక్ కేసుకు సంబంధించి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు సిబ్బందిని ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా కీలకమైన పోస్టుల్లో కొనసాగుతున్న వారిని మరోసారి పరిశీలించి, తగిన నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. వీరితోపాటు ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో నిబద్ధతగా పనిచేస్తున్న వారిని గుర్తించి, డిప్యూటేషన్ లేదా ఇతర మార్గాల్లో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోకి తీసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు.. ఇందుకోసం నిబంధనలు ఎలా ఉన్నాయని అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే జనార్దన్ రెడ్డి రాజీనామా చేస్తారని ప్రగతి భవన్ సమాచారం అందరంతో.. కెసిఆర్ సన్నిహితులు రంగంలోకి దిగి జనార్దన్ రెడ్డికి నచ్చ చెప్పారని సమాచారం.