Stray Dog Menace
Stray Dog Menace: అది అక్షరాస్యతలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం. 96 శాతానికిపైగా అక్షరాస్యత ఉన్న ఆ రాష్ట్రంలో తల్లిడ్రులు బడీడు పిల్లలను బడికి పంపిస్తారు. ఎంత కష్టమైనా చదువు మాన్పించరు. కానీ అదేరాష్ట్రంలోని ఓ పాఠశాలను అధికారులే మూసివేవారు. కారణం కుక్కలు. పాఠశాల ఆవరణలో కుక్కల బెడద పెరగడం, విద్యార్థులపై దాడిచేస్తుండడంతో వాటితో వేగలేక అధికారులే పాఠశాలకు సెలవు ప్రకటించారు.
పిల్లలపై దాడి..
పాములు, విష పురుగుల కారణంగా, విద్యార్థులు లేని కారణంగా పాఠశాలలు మూసివేసిన ఘటనలు చూశాం. కానీ, కేరళ రాష్ట్రంలోని కోజికోడ్లో కూతాలి పంచాయతీ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని కుక్కల కారణంగా మూసివేశారు. గత ఆదివారం సాయంత్రం వీధికుక్కలు పాఠశాల ఆవరణలోకి వచ్చి నలుగురు పిల్లలపై దాడిచేసి గాయపర్చాయి. విద్యార్థుల భద్రతపై ఆందోళనలు తలెత్తడంతో విద్యాశాఖతో చర్చించి పాఠశాలలకు సెలవు ప్రకటించాలని పంచాయతీ నిర్ణయించింది.
6 పాఠశాలలు.. 17 అంగన్వాడీ కేంద్రాలు..
వీధికుక్కల భయంలో కూతాలి పంచాయతీలోని ఎనిమిది పాఠశాలల్లో ఆరు పాఠశాలలు, 17 అంగన్వాడీ కేంద్రాలు సోమవారం మూతపడ్డాయి. విద్యార్థులు తమ ఇళ్ల నుండి పాఠశాలకు కాలినడకనవస్తుండగా, కుక్కలు వెంటపడుతున్నాయి. భయపెడుతన్నాయి. పిల్లలను బడికి, అంగన్వాడీ కేంద్రాలకు పంపేందుకు భయపడుతున్నామని తల్లిదండ్రులు పంచాయతీ అధికారులకు తెలిపారు. కుక్కలను నియంత్రించాల్సిన అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు పంచాయతీ అధ్యక్షురాలు బిందు కేకే తెలిపారు.
చంపొద్దనే నిబంధనతో..
వీధి కుక్కల వీరంగం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేరళలోనూ అధికంగా ఉంది. వీధుల్లో తిరుగుతూ వీరంగం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంగా చిన్న పిల్లలు, మహిళలపై దాడులు చేస్తున్నాయి. కుక్కలను చంపొద్దనే నిబంధన ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడంలోనూ అధికారులు అలసత్వం వహిస్తున్నారు. దీంతో కూతాలి పంచాయతీ పరిధిలో కుక్కల సంఖ్య విపరీతంగా పెరిగింది. గుంపులుగా దాడిచేస్తుండడంతో విధిలేని పరిస్థితిలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకే సెలవులు ప్రకటించడం గమనార్హం. పంచాయతీలో ఏబీసీ ప్రాజెక్టు ఇంకా అమలు కాలేదని, వీధికుక్కల బెడద నివారణకు దీర్ఘకాలిక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని బిందు కేకే తెలిపారు.