ఈ మధ్య కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమ పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నాయి. ముఖ్యంగా మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే చాలామంది మహిళలు ఆ పథకాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అర్హులైనా ఆ పథకాల ప్రయోజనాలను పొందలేకపోతుంటారు. మహిళల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి మాతృ వందన యోజన కూడా ఒకటి.
కేంద్ర ప్రభుత్వం గర్భిణీ మహిళలను దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా మాతృ వందన యోజన పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ లో చేరిన గర్భిణీ మహిళలకు మూడు విడతల్లో 6,000 రూపాయల సాయం అందజేస్తోంది. ఈ స్కీమ్ కు అర్హులైన మహిళలు దరఖాస్తు చేసే సమయంలో బ్యాంకు ఖాతాను జత చేయాల్సి ఉంటుంది. కేంద్రం అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాలలో నగదును జమ చేస్తోంది.
కేంద్రం మాతృ వందన యోజన పథకాన్ని ప్రధానంగా తల్లీబిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తుంది. అయితే ఈ పథకానికి అర్హత పొందాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. గర్భిణీ మహిళలు ఆశా వర్కర్ లేదా అంగన్ వాడీ కేంద్రంలో సమాచారం ఇచ్చి సరైన పత్రాలను సమర్పించి ఈ పథకంలో చేరవచ్చు. అయితే కేంద్రం తొలిసారి గర్భం దాల్చిన మహిళలు మాత్రమే ఈ పథకానికి అర్హులని పేర్కొంది.
కేంద్రం నుంచి తొలి విడతగా 1000 రూపాయలు, రెండో విడతగా 2,000 రూపాయలు, మూడో విడతగా 2,000 రూపాయలు అందుతాయి. మిగిలిన 1,000 రూపాయలు ఆస్పత్రిలో డెలివరీ తరువాత ఆస్పత్రి యాజమాన్యం అందజేస్తుంది. కేంద్రం స్కీమ్ లో చేరిన వెంటనే తొలి విడత, గర్భిణి అయిన 6 నెలల తరువాత రెండో విడత, పిల్లలకు డీపీటీ, హెపటైటిస్ బి, ఓవీవీ, బీసీజీ లాంటి వ్యాక్సిన్లు వేయించిన తరువాత మూడో విడత నగదు జమ చేస్తుంది.