Pawan Kalyan- Kandukuru Incident: నెల్లూరులో చంద్రబాబు పర్యటనలో తీవ్ర అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తొక్కిసలాటలో ఎనిమది మంది మృత్యువాత పడ్డారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటన టీడీపీలో కలరపాటుకు గురిచేసింది. అన్ని పార్టీల నేతలు ఈ ఘటనపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు. ట్విట్ చేశారు. ఇప్పుడది వైరల్ గా మారుతోంది. తెలుగుదేశం పార్టీ సభ జరుగుతుండగా తొక్కిసలాట జరగడం, ఎనిమిది మంది మృతిచెందడం, మరికొందరు ఆస్పత్రిపాలు కావడం దురదృష్టకరమన్నారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే వెన్నుదన్ను అని.. అటువంటి కార్యకర్తలు మృతిచెందడం బాధాకరమన్నారు. ఆ పార్టీకి తీరని లోటు అన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే పవన్ ప్రకటనలో ఎక్కడా చంద్రబాబు పేరు ప్రస్తావించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల టీడీపీ, జనసేన మధ్య సానుకూల వాతవరణం ఉంది. రెండు పార్టీలు పరస్పరం గౌరవించుకుంటూ వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీచేస్తాయన్న వార్తలు వస్తున్నాయి. అటు విశాఖలో ఘటనలో పవన్ ను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంది. విశాఖ నగరం నుంచి పవన్ ను బయటకు పంపించింది. ఆ సమయంలో పవన్ కు చంద్రబాబు స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపారు. అయితే ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావన లేకుండా పవన్ స్పందించడంపై భిన్న స్వరాలు వ్యక్తమవుతున్నాయి. ఎనిమిది మంది టీడీపీ కార్యకర్తలు చనిపోయేసరికి చంద్రబాబు కూడా నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. కన్నీటిపర్యంతమయ్యారు. అయితే పవన్ ప్రత్యక ప్రకటన విడుదల చేయడంతో టీడీపీకి స్వాంతన చేకూరినట్టయ్యింది. టీడీపీకి ఎదురైన ఈ ఘటనకు పవన్ స్పందించడంపై తెలుగుదేశం నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వైసీపీ నేతలు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లలో వైఫల్యం కారణంగానే ఘటన చోటుచేసుకుంటున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. ఆ వివరాలు తెచ్చుకునే పనిలో ఉంది. అటు తరువాత కేసుల నమోదు చేసే చాన్స్ ఉంది. అయితే ఈ కష్టకాలంలో పవన్ స్పందించడం.. టీడీపీ కార్యకర్తల మృతి దురదృష్టకర ఘటనగా పేర్కొనడం విశేషం. అటు వైసీపీ సైతం విమర్శలు చేసే అవకాశముండడంతో పవన్ వ్యూహాత్మకంగా ఘటనపై స్పందించారని.. చంద్రబాబు ఊసెత్తకపోవడం సరైన చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.